మాయమాటలతో ట్రాప్.. ఢిల్లీకి చేరిన తెనాలి యువతి.. ఫేస్బుక్ మెసెంజర్తో సేఫ్
గుంటూరు : సోషల్ మీడియాతో మంచి, చెడు రెండున్నాయి. ఎవరు ఎలా వాడుకుంటే అలా అన్నమాట. అయితే కొందరు మంచి కన్నా చెడునే ఎక్కువగా వైరల్ చేస్తుంటారు. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాపై అసంతృప్తి ఆవహిస్తుంటుంది. అయినా మళ్లీ దాని జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నారు చాలామంది. అంతలా జనజీవనంలో దాని పాత్ర మమేకమై పోయింది. అయితే కొన్ని కేసులను సోషల్ మీడియా సాల్వ్ చేస్తుండటం విశేషం.
సోషల్ మీడియా ఆధారంగా మిస్సింగైన ఓ యువతి ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డిగ్రీ విద్యార్థిని ఏప్రిల్ 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సదరు యువతి రాత్రైనా ఇంటికి చేరలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అవమానం, దుర్భర జీవితం.. ఆత్మవిశ్వాసంతో బతికేలా అవకాశమివ్వండి.. హిజ్రాల విన్నపం
దాంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఐ అనిల్ కుమార్ దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే తమ బంధువుల కుటుంబానికి చెందిన శశికాంత్ అనే యువకుడు ఢిల్లీలో నివసిస్తున్నాడని.. అతడిపై అనుమానం ఉందని యువతి పేరెంట్స్ క్లూ ఇవ్వడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు ఎస్ఐ.
అదలావుంటే ఈ నెల 12వ తేదీన ఢిల్లీ చాలా బాగుందంటూ సదరు యువతి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా తన చెల్లెలికి మెసేజ్ పంపింది. ఆ విషయాన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే రంగంలోకి దిగారు. టెక్నాలజీ వాడుకుని ఆ మెసేజ్ నోయిడా ప్రాంతం నుంచి వచ్చినట్లుగా నిర్ధారించుకున్నారు. ఆ మేరకు ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఆమె హర్యానాలోని గుర్గావ్లో ఉన్నట్లు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. స్థానిక పోలీసుల సాయంతో ఆ యువతిని తెనాలికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.