ఫ్లెక్సీల చిచ్చు .. టీడీపీతో కాదు వైసీపీలోనే .. కొట్లాట, కేసునమోదు
ఏపీలో ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సారి ఘర్షణ టీడీపీ , వైసీపీ మధ్య కాదు. వైసీపీ కార్యకర్తల మధ్యే ... రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానై కార్యకర్తలు కొట్టుకునేదాకా వెళ్ళింది. దీంతో అధికార పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బయటకు వస్తున్నాయి.
లోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లాలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా విబేధాలు నెలకొన్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుల మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి తన ఫోటో పెద్దదిగా వేయించుకుని ఎంపీ నందిగం సురేష్ ఫోటోను చిన్నగా వేయించారు. దీంతో ఎంపీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఫోటో చిన్నగా వేయిస్తారా అంటూ ఆయన అనుచరులు ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అక్కడితో ఆగలేదు అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. నడిరోడ్ మీద కొట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ నందిగం సురేష్ అనుచరులపై ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గొడవలు కేసులు దాకా పోవడంతో గుంటూరు జిల్లా రాజకీయాల్లో వీరి కొట్లాట హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. మొత్తానికి ఫ్లెక్సీ ల గొడవ ఆ టీడీపీతోనే కాదు సొంత పార్టీలోనూ కొనసాగుతుండటం గమనార్హం .