మంగళగిరి సీటును జగన్ కు కానుకగా ఇస్తాం: వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
అమరావతి: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం ఆమె హైదరాబాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్.. ఆమెకు పార్టీ కండువా కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 2009 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
భారత్పై మరో ఉగ్రదాడి జరిగిందో..! పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక
పద్మశాలి కులానికి చెందిన నాయకురాలు కావడం కలిసి వచ్చే విషయం. మంగళగిరిలో పద్మశాలీల ఓటుబ్యాంకు అధికంగా ఉంది. తమ కులానికి, ముఖ్యంగా బీసీలకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని అంటూ మంగళగిరి నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు ఆరోపించిన విషయం తెలిసిందే. టీడీపీకి ఓటు వేయకూడదంటూ వారు తీర్మానించారు కూడా. అదే సమయంలో పద్మశాలి కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సీపీలో చేరడం ఆ పార్టీకి రాజకీయంగా లబ్ది కలిగించేదే.
ప్రస్తుతం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి బరిలో ఉన్నారు. రాజకీయంగా అన్ని విషయాలనూ ఆరా తీసిన తరువాతే, లోకేష్ మంగళగిరి స్థానాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. వార్ వన్ సైడ్ కాదు అనేది మాత్రం కాదని నిరూపితమౌతోంది. నారా లోకేష్ కు పోటీ తీవ్రంగా ఉంది.
సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. అదే సమయంలో- కాండ్రు కమల వైఎస్ఆర్ సీపీలో చేరడం ఆళ్ల రామకృష్ణా రెడ్డి బలాన్ని మరింత పెంచినట్టయింది. 2009 ఎన్నికల్లో కాండ్రు కమల 12 వేలకు పైగా భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం, ఆమె వర్గం మొత్తం ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైపు మొగ్గు చూపడం వల్ల లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.