మాజీ ఎమ్మెల్యే మనవళ్లు కరోనా బారినపడి మృతి: వీరిలో ఒకరు వైసీపీ నేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలే కాక, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రెండున్నర లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
మొదట పెద్ద మనవడికి కరోనా పాజిటివ్..
తాజాగా, గురజాల మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు మనవళ్లు కొత్త నరేష్(35), కొత్త రామకృష్ణ(32) కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్త వెంకటేశ్వర్లు కుమారుడు కోటేశ్వర్ రావుకు ఇద్దరు కుమారులు. వారిలో నరేష్ పెద్దవాడు. అతడు పిడుగురాళ్లలో వ్యాపారం చేస్తున్నాడు. కాగా, మరో కుమారుడు రామకృష్ణ వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే, వీరిద్దరిలో మొదటగా నరేష్కు కరోనా పాజిటివ్ వచ్చింది.
పెద్ద మనవడు మృతి.. చిన్న మనవడికి సోకిన కరోనా..
అయితే, నరేష్ ఇంటి వద్దనే చికిత్స పొందుతుండటంతో అతనికి అతని తమ్ముడు రామకృష్ణ సపర్యలు చేశాడు. నరేష్ ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో అతడు జులై 21న మృతి చెందాడు. ఈ క్రమంలో నరేష్కు సేవలందించిన తమ్ముడు రామకృష్ణ కూడా కరోనా బారినపడ్డాడు.
రామకృష్ణను హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు..
ఈ క్రమంలో రామకృష్ణను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రామకృష్ణ కూడా చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు వదిలాడు. అన్నదమ్ముల మరణంతో ముత్యాలంపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
Recommended Video
ఇద్దరు మనవళ్ల మృతితో గ్రామంలో విషాధఛాయలు..
ఇద్దరు కుమారులను కోల్పోయిన వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రామకృష్ణ, నరేష్ మరణాల పట్ల గురజాల శాసనసభ్యుడు కాసు మహేందర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రామకృష్ణ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. రామకృష్ణ మృతి వైసీపీ పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు 2,44,549 మంది కరోనా బారినపడగా, 87,597 యాక్టివ్ కేసులున్నాయి. 1,54,749 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2203 మంది కరోనా బారినపడి మరణించారు.