ఇక నాగార్జున సాగర్ వంతు: గేట్లు ఎత్తివేత..పులిచింతల వైపు కృష్ణమ్మ పరుగులు!
గుంటూరు: మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలసవ్వడితో సందడి చేస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ నిండిపోవడంతో దిగువకు ప్రవహిస్తోన్న కృష్ణా జలాలు ఇక నాగార్జున సాగర్ ను ముంచెత్తాయి. రెండే రెండు రోజుల్లో నాగార్జున సాగర్ సైతం నిండిపోయింది. దీనితో సోమవారం ఉదయం జలవనరుల శాఖ అధికారులు నాగార్జున సాగర్ కు చెందిన నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తారు. కృష్ణా నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. నాగార్జున సాగర్ ను దాటుకుని కృష్ణా జలాలు ఇక.. పులిచింతల వైపు ఉరకలు వేస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది భారీగా వరద ప్రవాహానికి గురైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అసాధారణంగా కొనసాగుతోంది.
రాజకీయాల్లో కామన్: బూతులు తిట్టుకున్న సీఎం రమేష్, జీవీఎల్ చెట్టాపట్టాల్!
సాగర్ ను ముంచెత్తిన కృష్ణమ్మ..
దీని ఫలితంగా శ్రీశైలం రిజర్వాయర్ జలకళను సంతరించుకుంది. వరద ప్రవాహం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో రెండురోజుల కిందటే అధికారులు 12 గేట్లను ఒకేసారి తెరిచారు. కృష్ణా జలాలను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం నాగార్జున సాగర్ జలాశయాన్ని చేరుకుంది. ఆదివారం నాటికి నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం 543 అడుగులకు చేరుకుంది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 7,47,462 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు చేరుకుంటోందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో నీటిని దిగువకు వదిలారు అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తేశారు. దీనితో పాల నురగలా కృష్ణా జలాలు పులిచింతల ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతున్నాయి.
పులిచింతల వైపు పరుగులు..
సాయంత్రానికి పులిచింతల చేరుకుంటాయని అధికారులు తెలిపారు. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల అవుతోన్న నీటి ప్రవాహానికి అనుగుణంగా ఈ సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. సుమారు 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి పెడుతున్నట్లు చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం తక్కువే. అందులో కేవలం 66 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి వీలు ఉంది. నాగార్జున సాగర్ నుంచి నీటి ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే 24 లేదా 36 గంటల్లోనే పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని వివరించారు. అదే జరిగితే- పులిచింతల ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తివేసి, కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీకి వదులుతామని వెల్లడించారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం..
ఇదిలావుండగా- శ్రీశైలం రిజర్వాయర్ కు వరద ప్రవాహం కొనసాగుతూనే వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు చెందిన 12 గేట్ల ద్వారా కృష్ణా జలాలను దిగువకు వదిలి వేస్తున్నారు అధికారులు. సోమవారం ఉదయం 6 గంటల వరకు శ్రీశైలానికి 8, 68, 890 లక్షల క్యూసెక్కుల మేర ఇన్ ఫ్లో నమోదైంది. అదే సమయంలో- 6,60,348 లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ జలాశయాన్ని నింపేసింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఈ ఉదయానికి 878.60 అడుగులకు చేరువైంది. కృష్ణాతో పాటు తాజాగా తుంగభద్రకు కూడా వరద ప్రవాహం తోడు కావడం, మహారాష్ట్ర, కర్ణాటక పరీవాహక ప్రాంతాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో- మరింత నీటిని దిగువకు వదిలేయవచ్చని తెలుస్తోంది.
శ్రీశైలం టు సాగర్..
పర్యాటకులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం రిజర్వాయర్ కు ఇక నాగార్జున సాగర్ తోడైంది. ఫలితంగా- నాగార్జున సాగర్ వైపు పర్యాటకులు కూడా పరుగులు పెడుతున్నారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తేసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహన ప్రవాహం కూడా మొదలైంది. నాగార్జునసాగర్కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం వద్ద కూడా పర్యాటకులు సందడి నెలకొంది. ప్రాజెక్టు అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో డ్యాం వద్ద అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు.