స్నేహ పూర్వక ప్రభుత్వాలు అంటే ఇదే..! 2020 నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మిస్తామన్న కేంద్రం..!!
న్యూడిల్లీ/హైదరాబాద్ : స్నేహ పూర్వక ప్రభుత్వాల పని తీరు ఎలా ఉంటుందో కేంద్రం చెప్పకనే చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు సృష్టించుకుంటే రాష్ట్ర ప్రగతి ఎంత కుంటుపడుతుందో గత ప్రభుత్వంలో ఏపి ప్రజలు చవి చూసారు. కేంద్ర రావాల్సిన నిధులు సకాలంలో రాక ఆర్ధికంగా రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోయిన విషయం కూడా తెలిసిందే. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం, వైసీపి అనూహ్యంగా గెలుపొందడం జరిగింది. జగన్ తో స్నేహపూర్వకాంగా వ్యవహరిస్తామని చెప్పిన కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలువుదీరి నెల రోజులు గడవకముందే మంగళగిరిలో ఎయిమ్స్ ను నిర్మించేందుకు కేంద్రం సానుకూలతను తెలిపింది. దీంతో ఏపి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే అభివృద్ది వేగవంతంగా ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
2020 సెప్టెంబర్ నాటికి మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ మేరకు రాజ్యసభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఎయిమ్స్ను నెలకొల్పడానికి 2015 అక్టోబర్ 7న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఎయిమ్స్ నిర్మాణం కోసం మొత్తం 1618 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కేంద్రం 385.54 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. హాస్పిటల్, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 26 శాతం పూర్తయ్యాయని, 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్లో ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ వైద్య సేవలు ప్రారంభమైనట్లు కూడా మంత్రి చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు నిర్ణీత కాలవ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు.