గుంటూరులో ఘోరం: ఆశా వర్కర్ బ్రెయిన్ డెడ్: వ్యాక్సిన్ తరువాతే: ఆరా తీస్తోన్న కేంద్రం
అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం ఓ ఆశా వర్కర్ బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్న నాలుగో రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఏఎన్ఎం అనారోగ్యానికి గురైనప్పటికీ.. కోలుకున్నారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి.. దీనిపై వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నారు.
బ్రెయిన్ డెడ్కు గురైన ఆ ఆశావర్కర్ పేరు బొక్కా విజయలక్ష్మి. తాడేపల్లి మండలం పరిధిలోని పెనుమాకలో ఆమె పని చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ఆమె కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్నారు. నాలుగో రోజు అనారోగ్యానికి గురయ్యారు. కళ్లు తిరిగి, కిందపడి పోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ స్ట్రోక్కు గురైనట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జీ ప్రభావతి నిర్దారించారు.
విజయలక్ష్మి బ్రెయిన్ స్ట్రోక్కు గురైనట్లు తెలిపారు. వ్యాక్సిన్ ప్రభావం వల్ల ఆమె బ్రెయిన్ స్ట్రోక్కు గురి కాలేదని చెప్పారు. ఆసుపత్రిలో చేర్చిన వెంటనే ఆమెకు రేడియోగ్రఫి, అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించామని అన్నారు. బ్రెయిన్ డెడ్కు గురి కావడానికి వ్యాక్సినే కారణమనడాన్ని నిర్ధారించేలా రిపోర్టులు లేవని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ అనంతరమే ఆమె అనారోగ్యానికి గురయ్యారని విజయ లక్ష్మి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గొట్టిముక్కల లక్ష్మి అనే మరో ఏఎన్ఎం కూడా అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని జీజీహెచ్ డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గుంటూరు జీజీహెచ్ డాక్టర్ల నుంచి సమగ్ర నివేదికను తెప్పించుకోనుంది. కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ఆమెకు కోవాగ్జిన్ ఇచ్చారా? లేక కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదని అంటున్నారు.