రెడ్ జోన్ పరిధిలో జగన్ క్యాంపు ఆఫీసు- ప్రచారంపై స్పందించిన గుంటూరు కలెక్టర్
గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదువుతున్న నేపథ్యంలో తాడేపల్లి గ్రామం పరిధిలోకి వచ్చే సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కూడా రెడ్ జోన్ పరిధిలోకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం దీన్ని కావాలనే దాచి పెడుతోందని సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు ప్రచారం మొదలుపెట్టాయి. దీనిపై ఇవాళ గుంటూరు కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు
తాడేపల్లిలో కరోనా కేసులతో జగన్ ఆఫీసుకూ..
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాజాగా ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఇవాళ మరో అనుమానితుడిని గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇదే ప్రాంతంలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రభుత్వం రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనిపై వైసీపీ అభిమానులతో పాటు ప్రభుత్వ వర్గాల్లో సైతం ఆందోళన వ్యక్తమైంది. సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా దీనిపై వివరణ కోరుతూ ఫోన్లు వచ్చాయి.
గుంటూరు కలెక్టర్ క్లారిటీ...
Recommended Video
గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో కరోనా పాజిటివ్ కేసు వస్తే దాన్ని సీఎం క్యాంపు కార్యాలయానికి ముడిపెట్టి చూపడంపై గుంటూరు కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం నాలుగు కేసులు వస్తేనే ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించేలా నిబంధనలు ఉన్నాయని, ఇప్పటివరకూ సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న తాడేపల్లి పరిధిలో ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని, కాబట్టి ఇది రెడ్ జోన్ పరిధిలోకి రాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపై అనవసర ప్రచారం చేయొద్దని, ప్రభుత్వం స్ధానికంగా కరోనా వ్యాప్తి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.