కోడెల తనయుడిపై మరో కేసు.. 80 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండి..!
గుంటూరు : అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయనకు చెందిన బైక్ షోరూమ్లో వాహన విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగుచూసింది. రిజిస్ట్రేషన్ తదితర సేవలకు గాను కస్టమర్ల నుంచి దాదాపు 80 లక్షల మేర వసూలు చేశారు. అయితే వాటిని ప్రభుత్వ ఖాతాలో జమచేయడం మాత్రం విస్మరించారు. ఆ మేరకు గుంటూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కోడెల తనయుడిపై కేసు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామకృష్ణపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన దాదాపు 80 లక్షల రూపాయలు పక్కదారి పట్టించారనే ఆరోపణలతో గుంటూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు శివరామకృష్ణపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. కోడెల శివరామకృష్ణకు చెందిన బైక్ షోరూమ్లో భారీ కుంభకోణం జరిగినట్లుగా రవాణాశాఖ అధికారులు గుర్తించడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.
పురుగులు పట్టిన చికెన్.. దర్జాగా అమ్ముతూ.. అధికారులకు అడ్డంగా చిక్కి..!
బైక్ షోరూమ్లో అవకతవకలు.. డీటీసీ ఫిర్యాదు
గుంటూరు చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామకృష్ణకు బైక్ షోరూమ్ ఉంది. దానికి అనుబంధంగా జిల్లాలోని పలుచోట్ల అనధికారంగా యాభైకి పైగా సబ్ డీలర్లను నియమించినట్లు తెలుస్తోంది. అయితే ఆ షోరూమ్ల్లో అమ్మిన బైకులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండానే డెలివరీ ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోయినేడాది ఆ మేరకు డీటీసీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉండటంతో ఆయనకున్న పలుకుబడి కారణంగా అధికారులు శివరామకృష్ణ బైక్ షోరూమ్ జోలికి వెళ్లలేదనే కామెంట్లు చక్కర్లు కొట్టాయి. అదలావుంటే మళ్లీ ఇప్పుడు ఫిర్యాదులు అధికం కావడంతో జిల్లా రవాణాశాఖ కమిషనర్ విచారణ చేయించారు.
కస్టమర్ల నుంచి వసూలు.. ప్రభుత్వ ఖజానాకు మొండిచేయి..!
ఏడాదిగా తాత్కాలిక రిజిస్ట్రేషన్లు లేకుండా దాదాపు వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాలు విక్రయించినట్లు తమ విచారణలో గుర్తించారు జిల్లా రవాణాశాఖ అధికారులు. తాత్కాలిక రిజిస్ట్రేషన్తో పాటు లైఫ్ ట్యాక్స్, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ తదితర సర్వీసుల పేరుతో కస్టమర్ల నుంచి ఒక్కో వాహనానికి దాదాపు 8వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్ల నుంచి అలా వసూలు చేసిన మొత్తాన్ని మాత్రం ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా ఎగ్గొట్టారు. ఆ మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీరాప్రసాద్ నగరపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండానే బైకులు విక్రయించడంతో.. 1989 కేంద్ర మోటార్ వాహన చట్టం నిబంధన 42ను అనుసరించి కోడెల శివరామకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయనపై ఐపీసీ 406, 409, 420, 468, 471 సెక్షన్ల కింద శనివారం నాడు కేసు నమోదు చేశారు.
శివరామకృష్ణపై ఎన్నో ఆరోపణలు..!
కోడెల శివరామకృష్ణపై ఇదివరకు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో కేసులు కూడా నమోదయ్యాయి. జులై నెలలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మోసం, కుల దూషణ, బెదిరింపు నేరాల ప్రకారం కేసు నమోదైంది. 2015లో మద్దూరి నాగరాజు అనే వ్యక్తికి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడెల శివరామ్ 5 లక్షల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో ఉద్యోగం ఇప్పించకపోవడంతో తన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరితే కులం పేరుతో దూషించారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడ దుకాణమే లేదు.. కానీ జీఎస్టీ నెంబర్.. 13 కోట్ల పన్ను ఎగవేత..!
శాటిలైట్ పైరసీకి పాల్పడ్డారని..!
ఇదే ఏడాది ఏప్రిల్లో శాటిలైట్ పైరసీకి పాల్పడుతూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు శివరామకృష్ణను చుట్టుముట్టాయి. ఆయనకు చెందిన కే ఛానల్ కార్యాలయంలో అప్పట్లో ఢిల్లీ హైకోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ సోదాలు కూడా నిర్వహించారు. పైరసీకి ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వరుస వివాదాలతో కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామకృష్ణపై పలు కేసులు నమోదు కావడం గమనార్హం.