గుంటూరు పోలీసు బైక్లకు వైసీపీ రంగులు- జగన్కు బర్త్డే గిఫ్ట్- విమర్శల వెల్లువ
ఏపీలో ప్రభుత్వ భవనాలకు, స్మశానాలకు, వాటర్ ట్యాంకులకు, బోర్లకు ఇలా కనిపించిన వాటికల్లా వైసీపీ రంగులు పులిమేసి ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొన్న ప్రభుత్వం.. అనంతరం కోర్టు తీర్పులతో ప్రభుత్వ భవనాలకు మాత్రం రంగులు మార్చింది. దీనికి కూడా దాదాపు 4 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ చర్యలను విమర్శించారు. ఆ వివాదాలు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో గుంటూరు పోలీసులు ఈసారి ఏకంగా తమ బైక్లకే వైసీపీ రంగులు వేసి మరోసారి విమర్శలకు తావిచ్చారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
గుంటూరు పోలీసుల నిర్వాకం
నిన్న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో పోలీసులు దిశ పోలీసుల కోసం ప్రత్యేక బైక్లను ప్రారంభించారు. దిశ చట్టంలో మార్పులతో పోలీసు స్టేషన్లు తొలగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం బాధితులపై పడకుండా నేరుగా పోలీసులే వారి వద్దకు వెళ్లేందుకు ఈ బైక్లను అందించారు. అయితే ఈ బైక్ల ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి పోలీసులు షాకిచ్చారు. సాధారణంగా వాహనాలు వాటి తయారీ కంపెనీ రంగులతో ఉంటాయి. కానీ ఈ బైక్లు మాత్రం వైసీపీ రంగులతో ఉన్నాయి. దీంతో వీటిని చూసిన వారంతా అవాక్కయ్యారు.
జగన్ బర్త్డే గిఫ్ట్గా?
వాస్తవానికి నిన్న సీఎం జగన్ పుట్టినరోజు. నిన్న వైసీపీ శ్రేణులతో పాటు నేతలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అంతా ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనూ పలు విన్నూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఇదే కోవలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గిఫ్ట్ ఇద్దామనుకున్నారో ఏమో కానీ గుంటూరు పోలీసులు వైసీపీ రంగులతో బైక్లు ప్రారంభించారు. దీంతో ఇప్పుడు పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అయినా ఇప్పటికీ వారు దీనిపై స్పందించలేదు. ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ బైక్ల విడుదల కావడాన్ని బట్టి చూస్తుంటే ఇది కావాలనే తయారు చేయించినట్లు అర్దమవుతోంది.
వైసీపీ బైక్లపై డీజీపీకి టీడీపీ ఫిర్యాదు..
వైసీపీ రంగులతో గుంటూరు పోలీసు బైక్ల ప్రారంభోత్సవంపై డీజీపీ గౌతం సవాంగ్కు టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫిర్యాదు లేఖ రాశారు.రాజకీయ పార్టీకి సంబంధించిన రంగులను ప్రభుత్వ వాహనాలపై ముద్రించడమే కాకుండా స్వయంగా ప్రభుత్వ అధికారే వాటిని ప్రారంభించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఇందులో ఆరోపించారు. గతంలలో తమ ప్రభుత్వం షీటీమ్స్ ను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 వాహనాలకు పైగా సమకూర్చిందని, ఆ వాహనాలకే వైకాపా రంగులు అద్ది తిరిగి పంపిణీ చేశారని ఆరోపంచారు. ఇప్పటికే రంగుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సర్వోన్నత న్యాయస్థానం ఎండగట్టిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. పోలీసు వాహనాలకు వైకాపా రంగుల వాడటకంపై సమగ్ర విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకుని ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.