పంచాయతీ ఎఫెక్ట్: మంగళగిరిలో నారా లోకేష్: జగన్ రెడ్డి ఒత్తిడి వల్లే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ
గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. సుదీర్ఘ విరామం తరువాత గుంటూరు జిల్లా మంగళగిరికి వచ్చారు. మంగళగిరిలో ఆయన పర్యటిస్తోన్నారు. తొలుత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. మెగా ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజా రాజకీయ పరిస్థితులు.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు.
ఘన స్వాగతం పలికిన నాయకులు..
ఈ ఉదయం మంగళగిరి వచ్చిన ఆయన నేరుగా..శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత మంగళగిరి వచ్చిన ఆయనకు టీడీపీకి చెందిన స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతాన్ని పలికారు. పూలు చల్లి ఆహ్వానించారు. లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. లక్ష్మీ నరసింహా బంగారు వర్తకుల సంక్షేమ సొసైటీ ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.
మెగా హెల్త్ క్యాంప్..
ఈ ఉదయం సందర్భంగా ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. శాలువను కప్పి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రక్తదానం చేస్తోన్న పార్టీ అభిమానులను పలకరించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. మెగా హెల్త్ క్యాంప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గం పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
దౌర్జన్యాలకు దిగుతోన్న వైసీపీ..
పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోయాయని విమర్శించారు. ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని, అధికార దుర్వినియోగం చేసిందంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పారు.
విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని నారా లోకేష్ తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే తమ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ విశాఖపట్నంలో దీక్షకు కూర్చున్నారని గుర్తు చేశారు. వందలాది మంది విశాఖపట్నం ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మున్ముందు మరింత ఉద్యమిప్తామని ఆయన హెచ్చరించారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందని నారా లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి.. దాన్ని విక్రయిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒత్తిళ్లతోనే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి అంగీకరించిందని అన్నారు. వారే ఒత్తిడి తెచ్చి.. వారే మళ్లీ దాన్ని అడ్డుకుంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.