గుంటూరులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం: ఒకే పోలీస్స్టేషన్: ఎన్నో అనుమానాలు
గుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు సేవించి బలవన్మరణానికి ప్రయత్నించారు. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్ఐ శ్రావణి స్వస్థలం ప్రకాశం జిల్లా. కానిస్టేబుల్ రవీంద్రది గుంటూరు జిల్లా కర్లపాలెం. ఒకే పోలీస్స్టేషన్లో పనిచేస్తోండటం వల్ల ఇద్దరిపై పుకార్లు రావడమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. శ్రావణి కుటుంబ సభ్యులు మాత్రం రవీంద్రను కుటుంబ సభ్యుడిగా చూసుకునే వారని చెబుతున్నారు. నాలుగేళ్లుగా రవీంద్ర చుండూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం రవీంద్ర వీఆర్కు బదిలీ అయ్యారు. శ్రావణి ఏడెనిమిది నెలల కిందట ఎస్ఐగా చుండూరు స్టేషన్కు బదిలీ అయ్యారు. శనివారం శ్రావణి విధులకు హాజరు కాలేదు.
అదే రోజు రాత్రి శ్రావణి, రవీంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. తొలుత తెనాలి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించినట్లు చుండూరు సీఐ తెలిపారు. వారిద్దరు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు తెలియరాలేదని అన్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
Recommended Video
శ్రావణి ఇదివరకు నరసరావుపేట దిశ పోలీస్స్టేషన్లో పని చేశారు. ఆ తరువాత గత ఏడాది అక్టోబర్లో చుండూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. వారిద్దరి ఆత్మహత్యాయత్నానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ గుంటూరు ఆసుపత్రిలో అపస్మాకర స్థితిలో ఉన్నారని చుండూరు సీఐ చెప్పారు. వారిద్దరు సాధారణ స్థితికి చేరుకోగానే స్టేట్మెంట్ను నమోదు చేస్తామని అన్నారు.