గుంటూరు వైసీపీలో మళ్లీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే- కృష్ణదేవరాయలను అడ్డుకున్న రజనీ వర్గం...
గుంటూరు వైసీపీలో ఉప్పూ నిప్పుగా ఉంటున్న నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గాలు మరోసారి బహిరంగ రచ్చకు దిగాయి. చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని వాహనం దిగనీయకుండా రజనీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో వైసీపీ కార్యకర్త గంటా హరికృష్ణ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఎమ్మెల్యే విడదల రజనీ వర్గీయులు ఎంపీ వాహనాన్ని అడ్డుకున్నారు.
తమకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని స్ధానిక వైసీపీ నేత కోటిరెడ్డి ప్రశ్నించారు. తాను పరామర్శ కోసమే వచ్చానని ఎంపీ చెప్పినా వారు వినిపించుకోలేదు. ఎంపీ వాహనం ముందుకెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు.
ఈ సందర్భంగా రజనీ వర్గీయులకూ ఎంపీ లావు కృష్ణదేవరాయలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనధికారిక కార్యక్రమాలకు సైతం అడ్డంకులు కల్పించడం సరికాదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంపీని అక్కడి నుంచి పంపించేశారు.
వాస్తవానికి గతంలోనూ పలుమార్లు చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విడదల రజనీకి సమాచారం ఇవ్వకుండానే ఎంపీ లావు కృష్ణదేవరాయలు అక్కడికి రావడం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం జరిగాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే మరోసారి ఎంపీ సమాచారం లేకుండానే రావడం, ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడంతో మరోసారి ఇది వివాదాస్పదమైంది.