వస్తున్నాయ్...వస్తున్నాయ్ జగనన్న రథచక్రాల్..! విజయసాయి రెడ్డి ఉద్విగ్నం
Recommended Video
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రౌండ్ ముగిసే సరికి 150 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యాన్ని నమోదు చేయడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఫలితాలను చూస్తూ.. ఉద్విగ్నభరితులయ్యారు. ఉద్వేగానికి గురయ్యారు.
వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు? సాయంత్రం ప్రెస్మీట్! ప్రశాంత్ కిశోర్ కూడా?
వస్తున్నాయ్...వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయ్.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. కష్ట జీవులకు, కర్షక వీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, పొలాలనన్నీ హలాల దున్నీ హేమం పండించి... జగానికంతా సౌఖ్యం నింపేందుకు జగనన్న రథ చక్రాలు భూమార్గం పట్టాయి. కుహనా పార్టీ పునాదులు కూకటి వేళ్ళతో కదిలిపోతున్నాయి.. అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇన్నేళ్ల పాటు తాము పడ్డ కష్టం వృధా కాలేదని ఆయన చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ అవినీతిమయ పరిపాలనను తెర దించడంలో అన్ని వర్గాల ప్రజల పాత్ర ఉందని అన్నారు. మహిళలు, వృద్ధులు, పేదలు, బడుగులు, దళితులు.. అనే తేడా లేకుండా దాదాపు అన్ని వర్గాలవారు కూడా తెలుగుదేశం పరిపాలనపై విసిగిపోయారని, అందుకే - ఆ పార్టీ దారుణంగా పరాజయం పాలైందని అన్నారు.
సూర్యుడు తూర్పున మాత్రమే ఉదయించాలనే రూల్ ఏమీ లేదన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తించారని విమర్శించారు. పీడ కలల్లో మునిగిన చంద్రబాబు ఆయన భజన బృందానికి తెల్లారిన విషయం కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు శకం ముగిసిందని, నిజమైన ప్రజాస్వామ్యం చాలా ఏళ్ల తర్వత మళ్లీ ప్రభవించిందని ఆయన వ్యాఖ్యానించారు.
వివిప్యాట్లు, వాటి స్లిప్పులను లెక్కించాలని చంద్రబాబు చేస్తున్న హడావుడి ఆయనను ఓ జోకర్ స్థాయికి తీసుకెళ్లాయని మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ మూడు హిందీ రాష్ట్రాల్లో గెలిచినపుడు ఈవీఎంలు, వీవీప్యాట్ల గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా కోర్టుల చుట్టూ, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారని ఎద్దేవా చేశారు.
ఎగ్జిట్ పోల్ సర్వే పేరుతో లగడపాటి బయటపెట్టిన వివరాలకు తగిన ఆధారాలను చూపాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశారు?, ఎన్ని శాంపిల్స్ తీసారు? అనే విషయాలను శాస్త్రీయంగా విశ్లేషించడానికి చేపట్టిన పద్ధతేమిటో వెల్లడించాలని అన్నారు. లేకపోతే చీటింగ్ కేసు నమోదు చేసి లగడపాటిని అరెస్టు చేయాలని అన్నారు. ఇంకోసారి ఆయన సర్వే అనకుండా గుణపాఠం నేర్పాలని సూచించారు.