జగన్పై కత్తి దాడితో నాకు..ఆ మంత్రికి ఏం సంబంధం?;ఉడత ఊపులకు భయపడను:టిడిపి ఎమ్మెల్యే!
గుంటూరు:గురజాల టిడిపి ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నాయకుడు యరపతినేని శ్రీనివాస్ మరోసారి వైసిపి పై విమర్శల వర్షం కురిపించారు. తాను తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు భయపడే వాడినికానని యరపతినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈనెల 23న మంత్రి నారా లోకేష్ గురజాల రాక సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ గురజాలలో టిడిపి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఎయిర్పోర్టులో ప్రతిపక్ష నేత జగన్పై కత్తితో దాడి జరిగితే సిఎం చంద్రబాబు,మంత్రి ఆదినారాయణరెడ్డి, తనకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
తమపై వైసిపి ఆరోపణల నేపథ్యంలో ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాలు విసిరారు. ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే కోడి కత్తితో పరువు పొగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కోడి కత్తి దాడి గురించి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి మిగిలిన ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకోకుండా...కాపాడుకోవాలని వైసిపి, జగన్ కు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హితవు పలికారు.
మరోవైపు గుంటూరులోని టిడిపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో తెలుగు దేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రులకు నమ్మకద్రోహం చేసినందుకు కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎపి ప్రజలు కూకటివేళ్లతో పెకలిస్తారని జోస్యం చెప్పారు. మోడీ హయాంలో దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు బిజెపి హయాంలో ఎరువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
అయితే కేంద్రం ఏ మాత్రం సహకరించకపోయినా రైతు రుణమాఫీ చేసిన ఘనత సిఎం చంద్రబాబుకే దక్కిందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి సైతం అమలు చేశారని ఆంజనేయులు చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో నదుల అనుసంధానానికి సిఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని వివరించారు.
అయితే మరోవైపు విపక్ష నేతలు జగన్, పవన్ కళ్యాణ్ కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, విభజన హామీలను అమలు చేయకపోయినా...ఏకంగా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసినా ప్రధాని మోడీని పల్లెత్తు మాట అనడం లేదని ఆంజనేయులు మండిపడ్డారు. సీబీఐను మోడీ సొంత జేబులో సంస్థలా వాడుకుంటున్నారని, దేశంలో అత్యున్నత సంస్థలను ఆయన నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. అందుకే సీఎం చంద్రబాబు 'సేవ్ నేషన్...సేవ్ డెమోక్రసీ' పేరుతో దేశాన్ని రక్షించేందుకు నడుం బిగించారని...ఆ క్రమంలో దేశవ్యాప్తంగా బిజేపీయేతర రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి మోడీ ఆట కట్టించేందుకు చంద్రబాబు పూనుకున్నారని వివరించారు.