అపార్ట్మెంట్పైనుంచి పడి ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి
గుంటూరు: నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఐఐటీ విద్యార్థి అపార్ట్మెంట్ నుంచి కిందపడి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరుకు చెందిన గంగిశెట్టి రిత్విక్ కర్ణాటకలో ఐఐటీ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
కరోనా కారణంగా రిత్విక్ గత కొన్ని రోజులుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో చైతన్యపురిలో స్నేహితుడిని ఇంటికి శనివారం సాయంత్రం వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ ఆ అపార్ట్మెంట్ నుంచి పడి రిత్విక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైలు నుంచి పడి వ్యక్తి మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం అహిలా గ్రామానికి చెందిన గరీబ్ లాల్ మండాల్(34) చెన్నై నగరంలో పానీపూరి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఇటీవల స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి తమిళనాడు ఎక్స్ప్రెస్లో చెన్నై వెళ్లున్నాడు. ముఖం శుభ్రం చేసేందుకు వాష్బేసిన్ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత వచ్చే స్టేషన్ చూద్దామని తలుపు దగ్గరే నిలబడ్డాడు. ఈ క్రమంలో అదుపులో తప్పి రైలు నుంచి జారి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ద్విచక్ర వాహనంపైనుంచి పడి యువకుడు మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి, డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురానికి చెందిన లీలా ప్రసాద్రాజు(30) విజయవాడలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. వాహనం అదుపుతప్పడంతో డివైడర్ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలపాలైన ప్రసాద్ ప్రాణాలు వదిలాడు.