వైయస్ జయంతి గిఫ్ట్గా నామినేటెడ్ పదవులు: వీరికి ఖరారు చేసిన జగన్: అక్కడ సీటు కోసం పోటీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పోస్టులను పూర్తి చేసిన సీఎం రాష్ట్ర స్థాయి పోస్టులను అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీని నమ్ముకొని తొలి నుండి తనతో ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
జగన్కు బాబు వార్నింగ్:బోరున ఏడ్చిన మహిళలు.ఎలా ఓడారయ్యా:వాళ్లు ఆపకపోతే అక్కడే తిష్ఠ వేస్తా.
జిల్లా స్థాయి పోస్టులకు మాత్రం ఖచ్చితంగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఇవ్వాలని ఆదేశించారు. ఇక , అక్కడ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ పలువురు జగన్ ను కలిసి అభ్యర్దిస్తున్నారు. తుది వడపోత పూర్తి చేసి వైయస్ జయంతి అయిన ఈ నెల8వ తేదీన నామినేటెడ్ పోస్టుల ను అధికారికంగా ప్రకటించనున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ పైనే దృష్టి...
కేబినెట్ ఏర్పాటు..ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తవుతుండటంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల ని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే పలు పోస్టులకు జగన్ పేర్లు ఖరారు చేసారు. తొలి నుండి పార్టీ లో ఉంటూ..తననే నమ్ముకున్న వారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారో వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాల ని నిర్ణయించారు. ఆ దిశగానే కొందరి పేర్లు ఖరారు చేసారు. ఇక, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులు మాత్రం పూర్తిగా ఎమ్మెల్యేకు కాకుండా ద్వితీయ శ్రేణి కార్యకర్తలకే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఇప్పటికే ఎమ్మెల్యేల నుండి జాబితాలు సేకరించాలని ఆదేశించారు. ఇదే సమయంలో.. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ 50 శాతం వరకు బీసీ..ఎస్సీ- ఎస్టీ-మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఇప్పటికే జగన్ ప్రకటించారు. దీంతో.. సామాజిక సమీకరణాలు..ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని నామినేటెడ్ పోస్లులను ఈనెల 8న ప్రకటించాలని జగన్ నిర్ణయించారు.
ఇప్పటికే కొందరి పేర్లు ఖరారు..
రాష్ట్ర స్థాయిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసినట్లు సమాచారం. రోజాకు ఏపీఐఐసి ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ..సీఆర్డీఏ ఛైర్మన్గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎంపిక చేసారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా మోహన్బాబు కు అవకాశం దక్కనుంది. ఆర్టీసి ఛైర్మన్గా అంబటి రాంబాబు పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాపు కార్పోరేషన్ ఛైర్మన్గా గ్రంధి శ్రీనివాస్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని ద్రోణంరాజు శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్గా యేసురత్నం..సివిల్ సప్లయిస్ కమిషన్ ఛైర్మన్గా ఆమంచి కృష్ణమోహన్.. ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా మోషేన్ రాజు.. వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా మహ్మద్ ముస్తఫా.. ఇతర ఛైర్మన్ల పోస్టులను జగన్ దాదాపు భర్తీ చేసినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా భూమన కరుణాకర రెడ్డికి రాయలసీమ అభివృద్ది మండలి ఛైర్మన్గా ఖరారు చేయనున్నారు.
టీటీడీ బోర్డులో స్థానం కోసం నేతల ప్రదిక్షణలు..
ఇక ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి సుబ్బారెడ్డికి కేటాయించటంతో సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పలువురు పార్టీ నేతలు సీఎం జగన్ను అభ్యర్దిస్తున్నారు. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడు.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్లు జగన్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరి నుండి రౌతు సూర్యప్రకాశ రావు లేదా తోట వాణిల్లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. గన్నవరం నుండి పోటీ చేసిన వెంకట్రావు సైతం తనకు అవకాశం ఇవ్వాలని జగన్ను కలిసి కోరారు. అనంతపురం నుండి మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వనున్నారు. తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరు ఖరారైనట్లు చెబుతున్నారు. అదే విధంగా మహారాష్ట్ర..తమిళనాడు.. కర్నాటక నుండి ఒక్కొక్కరికి అవకాశం దక్కనుంది. ఈ లిస్టు సైతం త్వరలోనే ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.