రంగనాయకమ్మపై జగన్ సర్కార్ సీరియస్- రేపు విచారణ, అరెస్టు నోటీసులు జారీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ సాధారణ ప్రజల నుంచీ ఉన్నతస్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల వరకూ సోషల్ మీడియాలో సాగిస్తున్న విష ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ ఘటనతో పాటు మరికొన్ని కీలక అంశాలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సోషల్ ప్రచారం సాగిస్తున్న వారిపై సీఐడీ, ఐటీ బృందాలు నిఘా పెట్టాయి. గతంలో పెట్టిన పోస్టింగ్ లను సైతం తీసి వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.
ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..
వైసీపీ లక్ష్యంగా సోషల్ ప్రచారం..
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత వైసీపీపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలుగా విమర్శలు చేయడంలో తప్పేమీ లేకపోయినా పనిగట్టుకుని ప్రతీ విషయాన్ని విమర్శిస్తూ సాగుతున్న ఈ ప్రచారం తాజాగా పరిధులు దాటిపోతోంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ నేతలను ఆదర్శంగా తీసుకుని సాధారణ ప్రజలు, ఉన్నత స్దాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఇందులో భాగస్వాములవుతున్నారు. తాజాగా జరిగిన రెండు ఘటనలే ఇందుకు ఉదాహరణ. విజయవాడలోని పోలీసు హౌసింగ్ కార్పోరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ రావు, ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని గుంటూరుకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడాన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్లిందో తెలుస్తూనే ఉంది.
రంగనాయకమ్మ అరెస్ట్ కు రంగం సిద్ధం...
గుంటూరుకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ ఎక్కడో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడంపై సీఐడీ సీరియస్ అయింది. రేపు విచారణకు రావాలని ఆదేశించిన సీఐడీ.. అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోైవైపు ఇది ఈ వ్యవహారంలో ఆమె వెనుక ఎవరో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆరా తీశారు. దీంతో మల్లాడి రఘునాథ్ నే మరో వ్యక్తి ప్రమేయం బయటపడింది. దీంతో ఇతనిపైనా కేసు నమోదుకు రంగం సిద్దమైంది. వీరంతా ఎక్కడి నుంచి ఈ సందేశాలను ఆపరేట్ చేస్తున్నారు.
అందుకే ఆమెపై చర్యలు : సీఐడీ
ఎల్జీ పాలిమర్స్ ఘటన విషయంలో ఏపీ సర్కార్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రంగనాయకమ్మను అరెస్టు చేయబోతున్నట్లు సీఐడీ సంకేతాలు ఇచ్చింది. పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్టు చేయాల్సిన పరిస్ధితులు తలెత్తినట్లు సీఐడీ డీఎస్పీ సరిత ప్రకటించారు. సున్నితమైన అంశంలో ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సరిత తెలిపారు. ఇకపై ఏ వయసు వారు తప్పుచేసినా శిక్ష తప్పదని సరిత హెచ్చరించారు. ప్రజలను అయోమయానికి గురిచేసేలా ఎవరు ప్రచారం చేసినా శిక్ష తప్పదని సీఐడీ డీఎస్పీ తెలిపారు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ళ జైలుశిక్ష ,ఐదులక్షల జరిమానా విధిస్తుందని, రెండోసారీ తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష పదిలక్షల జరిమానా తప్పదని సరిత తెలిపారు.