జనసేన ప్రచార రథాలు సిద్ధం.. రోజుకు 170 గ్రామాల్లో క్యాంపెయిన్
మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, వైసీపీల్లో జంపింగ్ లు కొనసాగుతుంటే.. జనసేన మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రచారపర్వానికి తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా క్యాంపెయిన్ ముమ్మరం చేయడానికి సన్నద్ధమైంది. ప్రతిరోజు 170 గ్రామాల్లో ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు ప్రచార రథాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
జనసేన రథాలు వచ్చేశాయి..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఫోకస్ పెట్టాయి. టీడీపీ, వైసీపీలు రాజకీయ సమీకరణాల్లో లెక్కలు తేల్చుకుంటున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ గూటి నుంచి ఈ గూటికి చేరేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఆ రెండు పార్టీల్లో జంపింగులు కొనసాగుతున్నాయి. అదలావుంటే జనసేన మాత్రం అందరికంటే ముందుగానే జనాల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమైంది. ఆ మేరకు హైటెక్ హంగులతో 17 ప్రచార రథాలు సిద్ధమయ్యాయి. మంగళగిరిలో సోమవారం నాడు పూజకార్యక్రమాలు నిర్వహించి ప్రచార రథాలను ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా అక్కడున్న కార్మికులకు గాజు గ్లాసుతో టీ అందించారు.
17x10=170.. జనసేనాని ప్రసంగం
ప్రచార రథాలతో క్యాంపెయిన్ గట్టిగా నిర్వహించాలనేది జనసేన లీడర్ల అంతరంగంగా కనిపిస్తోంది. 17 ప్రచార రథాలను ప్రతిరోజు రాష్ట్రమంతటా తిరిగేలా షెడ్యూలు చేస్తున్నారు జనసేన నేతలు. ఆయా గ్రామాల్లో పర్యటించే ప్రచార రథాలు నెమ్మదిగా వెళ్లేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక్కొక్క ప్రచార రథాన్ని 10 గ్రామాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ లెక్కన 17 రథాలు 10 చొప్పున 170 గ్రామాలను కవర్ చేయనున్నాయి. ప్రతిదాంట్లోనూ ఎల్ఈడీ టీవీ అమర్చారు. వీటి ద్వారా పవన్ కల్యాణ్ ప్రసంగాలను క్షేత్రస్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లనున్నారు.
ప్రచారం, ఛాయ్, సభ్యత్వం
జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసును జనాల్లో ప్రమోట్ చేసేలా ప్రచార రథాలు రూపొందించారు. అంతేకాదు ఆయా గ్రామాల్లో పర్యటించే సందర్భంగా.. ప్రచార రథాల దగ్గర గాజు గ్లాసుతో ఛాయ్ అందివ్వనున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలకు దీటుగా దూసుకెళ్లాలని డిసైడయిన జనసేనాని.. ప్రచార పర్వాన్ని హీటెక్కించారు.