హస్తవాసి ఉన్న డాక్టర్ గా పేరున్న కోడెల ... తీవ్ర ఆవేదనలో నరసరావుపేట వాసులు
నరసరావుపేట వాసులతో అనుబంధాన్ని ముడివేసుకున్న కోడెల శివప్రసాద్ ఇకలేరు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ హఠాన్మరణం గుంటూరు జిల్లా వాసులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. చాలా కష్టపడి ఎంఎస్ చదివి డాక్టర్ గా సేవలందించిన కోడెల శివప్రసాద్ సేవలను నరసరావుపేట వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం ... ఆరుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా , స్పీకర్ గా ...
Recommended Video
గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947, మే 2న సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు జన్మించిన కోడెల మంచి హస్తవాసి ఉన్న డాక్టర్ గా ఆయన వైద్యవృత్తిని కొనసాగించారు. నరసరావుపేట వాసుల మన్ననలు పొందారు. 5వ తరగతి వరకూ కండ్లగుంట లో చదువుకున్న ఆయన నరసరావుపేటలో టెన్త్ వరకూ చదివారు. ఆ తరువాత, విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ వరకూ చదివారు. తన చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోయిన కారణంగా ఆయన వైద్య వృత్తిని ఎంచుకొని ఎంత మందికి ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. కోడెల మనసులో చిన్ననాడు చెరగని ముద్ర వేసిన సంఘటనలు డాక్టర్ కావాలన్న ఆయన ఆలోచనకు కారణమయ్యాయి.
గుంటూరు వైద్య కళాశాలలో చేరిన ఎంబీబీఎస్, బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో ఎంఎస్ చేశారు. నరసరావుపేటలో ఆసుపత్రిని ప్రారంభించి వైద్యుడిగా సేవలందించారు. ఆయన హస్తవాసి గొప్పదని నరసరావుపేట వాసులు చెప్పుకునేవారు. నరసరావుపేట లో మంచి పేరు సంపాదించిన ఆయన వైద్యుడిగా ఎంతోమందికి సేవలందించారు. నరసరావుపేట వాసుల ఆదరాభిమానాలను చూరగొన్న నేపథ్యంలోనే ఆయనపై నాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ దృష్టి పడింది. స్థానికంగా వైద్యుడు గా మంచి గుర్తింపు ఉన్న ఆయన ఆ తరువాత చాలా కాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతూ కూడా తన వైద్య సేవలను అందించారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. బసవతారక ఆస్పత్రికి చైర్మన్ గానూ పని చేశారు. చివరకు అదే ఆస్పత్రిలో డాక్టర్ కోడెల శివప్రసాద్ తుది శ్వాస విడిచారు.