రాజకీయ వేధింపులే కోడెల మరణానికి కారణమా ? శోక సంద్రంలో తెలుగు తమ్ముళ్ళు
Recommended Video
గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల శివప్రసాద్ తిరుగులేని నేత . తన రాజకీయ ప్రస్థానం మునుపెన్నడూ ఎరుగని విధంగా అవమానాల పాలై న కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజకీయాల్లో తిరుగులేని నేతగా, ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల శివప్రసాదరావు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత ఆ దృశ్యాన్ని చూసిన సహచరులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది హతాశులయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ ఆయన విగతజీవి గా మారినట్లు తెలుస్తోంది. దీంతో టిడిపి షాక్ లో మునిగిపోయింది.
మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య : కుమారుడితో గొడవ : చికిత్స పొందుతూ కన్నుమూత..!!
తెలుగు రాష్ట్రాల్లో కోడెల ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తన కుమారుడు, కుమార్తె కే టాక్స్ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేయించి, తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, పరువు తీయాలని చూస్తున్నారని గత కొంతకాలంగా కోడెల ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఫర్నిచర్ ను సొంతానికి వాడుకున్న ఘటన సైతం కోడెల ను ఇబ్బందులలోకి నెట్టింది. తన కుటుంబంపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసిపి ఈ విధంగా ప్రవర్తిస్తుందని కోడెల చాలా సందర్భాల్లో తన ఆవేదనను వెళ్ళగక్కారు. తాను విలువలకు కట్టుబడిన నేతనని పదేపదే చెప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల, ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకుని ఉంటారని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించిన కుటుంబ సభ్యులకు, టిడిపి శ్రేణులకు కోడెల మరణం పెద్ద షాక్ అని చెప్పాలి . చంద్రబాబు నాయుడు సైతం కోడెల మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. పల్నాడు పులిగా పేరు పొందిన కోడెల శివప్రసాద్ రాజకీయ వేధింపుల కారణంగానే తీవ్ర ఆవేదనతో, ఇంత సీరియస్ నిర్ణయం తీసుకున్నారని టిడిపి శ్రేణుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కోడెల మరణానికి వైసిపి నైతిక బాధ్యత వహించాలని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. కోడెల మరణం టిడిపికి తీరనిలోటని తెలుగు తమ్ముళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు.