చంద్రబాబు ఒత్తిడితోనే లింగమనేని లేఖ .. బహిరంగ చర్చకు సిద్ధమా అన్న ఆర్కే
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నివసిస్తున్న ఇంటి ఓనర్ లింగమనేని రమేష్ లేఖ రాశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చి వేస్తారని వార్తల నేపథ్యంలో లేఖ రాసిన ఆయన తను ఆవేదన చెందుతున్నట్లు గా లేఖలో పేర్కొన్నారు. తన ఇల్లు అక్రమ నిర్మాణం కాదని, ఉండవల్లి పంచాయితీ నుండి అన్ని అనుమతులు తీసుకున్నానని చెప్పిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా తను ఇల్లు నిర్మించలేదని పేర్కొన్నారు. ఇక లింగమనేని రమేష్ లేఖపై మంగళగిరి ఎమ్మెల్యే , సీఆర్డీఏ చైర్మన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు .
ఆ విషయంలో జగన్ ను తెగ పొగిడేస్తున్న కాంగ్రెస్ నేతలు .. ఏమన్నారంటే
లింగమనేనికి ఆర్కే సవాల్
చంద్రబాబు ఒత్తిడితోనే లింగమనేని రమేష్ లేఖ రాశారన్న ఆయన తప్పు చెయ్యకుంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. లింగమనేని చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్నారని మండిపడ్డారు. లింగమనేని గ్రామ పంచాయితీ నుండి అన్ని అనుమతులు తీసుకున్నానని పేర్కొన్నారని, అలాంటివేవీ లేవని , ఒకవేళ తీసుకుంటే చూపించాలని డిమాండ్ చేశారు. 271 సర్వేనెంబర్ ఎవరైనా ఎప్పుడైనా అడంగల్ లో చూడొచ్చు అన్న ఆర్కే అది ప్రభుత్వభూమి,కృష్ణానది అని చాలా స్పష్టంగా చెప్పబడి ఉందన్నారు .సర్వేనెంబర్లు 271,272 1 బి రికార్డ్ లలో అది ప్రభుత్వ భూమి, డొంక అని స్పష్టంగా ఉంటే దానికి ఇంటికి పర్మిషన్ ఇవ్వండి అనిఅడిగానని లింగమనేని రమేష్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు .
యాగాలు చేశారా .. బాబు, లోకేష్ లతో చెక్క భజనలు చేశారా అన్న ఆళ్ళ
లింగమనేని చెప్పింది ఎంతవరకు నిజమో ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఇటీవల సిఆర్ డిఏ కి రాసిన లేఖలో నాది 254,250 సర్వేనెంబర్లు అని పేర్కొన్నారని, అసలు ఆ సర్వే నంబర్లలో ఆయనకు భూమి లేదని పేర్కొన్నారు. యజ్ఞాలు,యాగాలకోసం గెస్ట్ హౌస్ కట్టామని చెప్పిన ఆయన , ఈ ఐదేళ్లలో ఎన్ని యాగాలు చేశారో చెప్పాలన్నారు . చంద్రబాబు,లోకేష్ లతో కలసి చెక్కభజనలేమైనా చేశారా అని ఎద్దేవా చేశారు. స్విమ్మింగ్ పూల్ కోసం అనుమతి తీసుకుని గెస్ట్ హౌస్ కట్టుకున్నారని, గెస్ట్ హౌస్ కు పంచాయితీ అనుమతులు,పేపర్లు ఉంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు .
లింగమనేని ఇంటి అనుమతులపై ప్రశ్నలు
మీ ఇంటికి ప్లాన్ ఏది? బిల్డింగ్ ఫీజు ఎంత కట్టారు అని ప్రశ్నించిన సీఆర్ డీఏ చైర్మన్ ఆర్కే ఆ బిల్డింగ్ నిర్మాణానికి పైసా ఫీజు కట్టలేదు.అనుమతులు రాలేదని పేర్కొన్నారు. ప్రహరీ గోడ కట్టరాదని నిభంధన ఉంటే లింగమనేని ఏకంగా ఇల్లే కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్కే. ఇక కరకట్టపై అక్రమ నిర్మాణాలు అవాస్తవమా అంటూ ప్రశ్నించిన ఆర్కే టిడిపి హయాంలోనే లింగమనేని రమేష్ కు అధికారులు నోటీసులు ఇవ్వలేదా? అంటూ నిలదీశారు .
ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే కుట్ర అన్న ఆర్కే
అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేనిఉమ ఆ ప్రాంతంలో బోటులో తిరిగి మీ గెస్ట్ హౌస్ కూడా అక్రమకట్టడం అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎందుకు ఈ విధంగా లేఖ రాయలేదు అన్న ఆర్కే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు,లింగమనేని కలిసే కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు ఆర్కే. అప్పటి నోటీసులకు స్పందించని లింగమేనేని రమేష్ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అని ప్రశ్నించారు. తండ్రికొడుకులిద్దరూ కోటి ఇరవైలక్షల అద్దెభత్యం శాసనసభ,మండలినుంచి తీసుకున్నారని పేర్కొన్నారు.
బాబుకు లింగమనేని ఇల్లు ఇవ్వటానికి మతలబు అందరికీ తెలుసన్న ఆర్కే
లింగమనేని ఎలాంటి ప్రతిఫలం లేకుండానే చంద్రబాబుకు ఇల్లు ఇచ్చారా? అని ప్రశ్నించిన ఆయన ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు మీ భూముల వద్దకే వచ్చి ఎందుకు పూలింగ్ హద్దు ఆపేశారని అందులో ఉన్న మతలబు అందరికీ తెలుసనీ చెప్పారు. ఓ అధికారిని భయపెట్టి ,బెదిరించి ఉడా అధికారినుంచి అనుమతి తెచ్చుకుని ఉంటారన్న ఆర్కే అది కూడా తాత్కాలికంగా ఇచ్చారు.పట్టాల్యాండ్ లోనే కట్టాలని కూడా ఆ ఆర్డర్ లో ఉడావారు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.
చంద్రబాబు, లింగమనేనిలది నాటకం అన్న ఆర్కే
ఆ గెస్ట్ హౌస్ ప్రభుత్వ ఆస్ది అని చంద్రబాబు దేవాలయంలాంటి అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారన్న ఆర్కే చంద్రబాబు ఇప్పుడు మాత్రం మాట మార్చి తాను అద్దెకు ఉంటున్నానని చెబుతున్నారని తెలిపారు. పదవిలో ఉన్నప్పుడు ఒకలా పదవి ముగిసిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇదంతా చంద్రబాబు, లింగమనేనిల నాటకం అని ఆర్కే విమర్శలు గుప్పించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిస్తామని చెప్పిన ఆయన లింగమనేనిపై ఊపిరి ఆడనివ్వకుండా ప్రశ్నల బాణాలు సంధించారు .