ఇది తుగ్లక్ పాలన .. జగనన్న ఇసుక బ్లాక్ మార్కెట్ లో.. భగ్గుమన్న లోకేష్
ఏపీ లో ఇసుక కష్టాలు భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తుంది . ఇసుక అమ్మకాలను నిలిపివేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిన సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం అవుతుంది . ఇసుకకి తీవ్ర కొరత ఏర్పడడంతో భవన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక కూలీలు పస్తులు ఉంటున్నారు . దినసరి కూలీతో పొట్టపోసుకునే కార్మికులు ఆకలితో ఆక్రోశిస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్మికుల కష్టాలపై స్పందించని పాలకుల వైఖరిపై భగ్గుమంటున్నారు.
సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ లేఖ .. వారి బాధలు చూసే ఈ లేఖ .. స్పందించండి
భవననిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక పడరాని బాధలు పడుతున్నా పట్టని పాలన తుగ్లక్ పాలన అన్న లోకేష్
రాష్ట్రంలో భవననిర్మాణ రంగ కార్మికులు ఉపాధిలేక పడరాని బాధలు పడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే తుగ్లక్ పాలనకు మచ్చుతునకలా ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇసుక దొరక్క పడుతున్న ఇబ్బందులను చూసిన లోకేష్ నిర్మాణ రంగంలో పనులు ఆగిపోయాయని, 16 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనిలేక అష్టకష్టాలు పడుతున్నారని పాలకులకు మాత్రం పట్టింపు లేదని నారా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు . రెండు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు రోజుకు రూ.500 చొప్పున రెండునెలల్లో రూ.30 వేల అప్పు చేసిన పరిస్థితి వచ్చిందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నిర్మాణ రంగ పరిస్థితికి అద్దం పడుతుందని ఆయన తన ట్వీట్ ద్వారాతెలియజేశారు .
రూ.4800 కోట్ల అప్పుల ఊబిలో 16 లక్షల మంది కార్మికులు.. జగనన్న ఇసుక పేరుతో వైసీపీ దందా అన్న లోకేష్
ఇక వైసీపీ నేతలు జగనన్న ఇసుక పేరుతో దందాలు చేస్తున్నారని సెటైర్ వేశారు నారా లోకేష్ . 16 లక్షల మంది కార్మికులు రూ.4800 కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకుపోతుంటే, వైసీపీ నేతలు రూ.1500కి దొరికే ట్రాక్టర్ ఇసుకను జగనన్న ఇసుక పేరుతో రూ.10 వేల వరకు అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మేతను చూసి వైసీపీ అధినేత మురిసిపోతున్నారని నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక పక్క నిర్మాణ రంగం కుదేలవుతున్నా కొత్త ఇసుక పాలసీ సెప్టెంబర్ 5 నుండీ అని జగన్ చెప్పటం ఆయనకు రాష్ట్ర ప్రజల సమస్యలపై ఉన్న చిత్తశుద్దికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.
నిర్మాణ రంగం కుదేలవుతున్న అంశంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
ఇక ఒక్క నారా లోకేష్ మాత్రమే కాదు టీడీపీ ముఖ్యనేతలు , బీజేపీ, జనసేన , కాంగ్రెస్ నాయకులు సైతం భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై స్పందిస్తున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇప్పటికే తాజా పరిస్థితులతో నిర్మాణ రంగంలో అవసరం అయిన మెటీరియల్ ధర బాగా పెరిగిపోయింది. అంతే కాదు భవన నిర్మాణాలు ఆగిపోవటంతో కొనుగోలుదారులు కొనుగోలు చెయ్యటానికి ఆసక్తి చూపటం లేదు. ఈ పరిస్థితి మారకుంటే భవిష్యత్ లో ఇది నిర్మాణ రంగంపై మరింత ప్రభావం చూపించే ప్రమాదం పొంచి ఉంది.