మాయ చేసిన 'మందల'గిరి...! ఇంత ఘోరంగా ఓడిపోతామనుకోలేదన్న లోకేష్..!!
అమరావతి/హైదరాబాద్ : టీడిపి ఘోర పరాజయంపై నారా లోకేష్ పెదవి విప్పారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ పరాభవానికి నేతలు, కార్యకర్తలే కారణమని మాజీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.
కనీసం వారిలోని అసంతృప్తిని తెలియజేయడంలోనూ విఫలమయ్యారని అన్నారు. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గుంటూరు పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన, పార్టీ ఓటమికి నేతలు, కార్యకర్తలే బాధ్యులని అన్నారు.
ఇంత ఘోరంగా ఓడిపోతామని ఎన్నడూ అనుకోలేదని, గెలుపు కచ్ఛితంగా మనదేనని చెబుతూ వచ్చిన నేతలు, అబద్ధాలు చెప్పినట్టు అర్థమవుతోందని అన్నారు. పోలింగ్ రోజు నుంచి కౌంటింగ్ వరకూ అనుక్షణం ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పినా అశ్రద్ధ, నిర్లక్ష్యాన్ని వహించారని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని ఒక్కరు కూడా గుర్తించలేదని తెలిపారు.
నిత్యం ప్రజల్లో ఉండే కార్యకర్తలకు, ఓటర్ల మనసులోని మాట తెలిసినా, దాన్ని తమ వద్దకు తీసుకురాలేక పోయారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటి తప్పులు జరుగకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. ఓడినా ప్రజల్లో ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని, అన్ని రోజులూ ఒకేలా ఉండవని లోకేశ్ అన్నారు.