దారుణం : మరదలి నగ్న ఫోటోలు ఫేస్బుక్లో పెట్టిన బావ..
గుంటూరులో దారుణం వెలుగుచూసింది. మరదలిపై పదేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడి వ్యవహారం బట్టబయలైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటు తన అక్కను చిత్ర హింసలకు గురిచేస్తూ.. ఇటు తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు,ఇటీవల తన నగ్న ఫోటోలను ఫేస్బుక్లో పెట్టాడని చెప్పింది.
అసలేం జరిగింది...
గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి కె.రవికిరణ్తో అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు 2010లో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకు ఆమె అనారోగ్యం పాలవడంతో.. ఇంటి పనులు చేసేందుకు అప్పుడప్పుడు ఆమె సోదరి(15) వచ్చేది. ఈ క్రమంలో మరదలిపై కన్నేసిన రవికిరణ్.. లైంగిక వేధింపులకు గురిచేశాడు. వేధింపుల గురించి ఎవరికైనా చెబితే అక్క కాపురం నాశనం అవుతుందని బ్లాక్మెయిల్ చేసేవాడు. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆ బాలిక బాధను మౌనంగా భరించింది.
బలవంతంగా తాళి కట్టి అత్యాచారం..
జులై,2018లో తమిళనాడులోని వేళాంగిణి ఆలయానికి రవికిరణ్ తన మరదలిని తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెకు బలవంతంగా తాళికట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తెపై తెనాలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొన్నాళ్లకు ఇద్దరూ తెనాలికి వచ్చారు. పోలీస్ స్టేషన్లో తనకు అనుకూలంగా మాట్లాడాలని యువతిని బలవంతపెట్టాడు. దీంతో పోలీస్ స్టేషన్లో అతను చెప్పినట్టుగానే ఆమె అతనికి అనుకూలంగా మాట్లాడింది.
ఫేస్బుక్లో నగ్న ఫోటోలు..
ఆ తర్వాత నుంచి అసలు నరకం మొదలైంది. భార్యను నిత్యం చిత్రహింసలు పెట్టేవాడు. ఇదే క్రమంలో మరదలికి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఎలాగైనా చెడగొట్టాలనుకున్నాడు. ఆమె నగ్న ఫోటోలను ఫేస్బుక్లో పెట్టి పరువు తీశాడు. దీంతో బాధితురాలు ఇక అతని వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తనపై లైంగిక దాడికి పాల్పడిన బావపై చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.