10 తరగతి ఫలితాలు రాగానే.. తామేనని, ఈవోడీబీ ర్యాంక్పై లోకేశ్, మంత్రి మేకపాటి సెటైర్లు..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం సాయంత్రం కేంద్రం జాబితా ప్రకటించగా.. ఆ ఘనత మాదేనని నారా లోకేశ్ కామెంట్ చేశారు. దీంతో ఈవోడీబీలో ఏపీ నెంబర్ వన్ ఎలా వచ్చింది.. ? సర్వే చేసిన వివరాలను పరిశ్రమల శాఖమత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అప్పుడు వేరు..
గతంలో ఈవోడీబీ ర్యాంకులు వచ్చిన విధానం వేరు.. ఇప్పుడు వేరని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. తొలిసారి సర్వే చేసి ఫలితాలిచ్చారని.. అందులో ఏపీ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇదివరకు ఇతర రాష్ట్రంతో నంబర్ వన్ ర్యాంకు పంచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సర్వేలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న పరిశ్రమలు గాడిన పడేలా ఆర్థిక తోడ్పాటు, భరోసాను సీఎం జగన్ కల్పించారని పేర్కొన్నారు.
వారి కృషి వల్లే
పరిశ్రమల శాఖ అధికారుల కృషితో రాష్ట్రానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానం వచ్చిందని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించగానే నారా లోకేష్ చేసిన ట్వీట్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. 10 వ తరగతి ఫలితాలు ప్రకటించిన రోజు నారాయణ స్కూల్ తరహాలో చేశారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు అలానే ఉన్నాయని తెలిపారు. రూ.4 వేల నుంచి 5 వేల కోట్ల వరకు చెల్లించామని తెలిపారు. రుణాల రీషెడ్యూల్ చేయడం ద్వారా 10 వేల ఎమ్ఎస్ఎమ్ఈలు నిలదొక్కుకున్నాయని చెప్పారు.
నమ్ముతారనే ట్వీట్..
ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారని లోకేష్ అనుకున్నారని.. అందుకోసమే ట్వీట్ చేశారని తెలిపారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం 32 లక్షల కోట్ల ఒప్పందాలు చేశామని గొప్పగా చెప్పిందని.. అందులో 50 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదని ప్రశ్నించారు. 'కియా'ని తీసుకొచ్చినందుకు గత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని.. కానీ, 20 ఏళ్ళపాటు ప్రభుత్వం పెనాల్టీ కట్టేలా రాయితీలు ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు.
పారిశ్రామికవేత్తలు హ్యాపీ..
పారిశ్రామిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈవోడీబీ కోసం సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు జరిగిందని.. ఆ సమయంలో ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉంది అని అడిగారు. 7,800 మందితో కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టిందని వివరించారు. ఇదివరకు ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారే సర్వే చేశారు. ఇప్పుడు గతంలో సర్వే జరగలేదన్నారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కరికాల వలవన్, సుబ్రహ్మణ్యం జవ్వాదిలను మంత్రి గౌతమ్ రెడ్డి ప్రశంసించారు.
30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు
పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనా దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం తోడ్పాటునిచ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా వీడియోను మీడియాకు ప్రదర్శించి చూపించారు. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ప్రపంచంలో 157వ స్థానంలో ఉందన్నారు. సంస్కరణలు తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ రోజు దిశానిర్దేశం చేశారని తెలిపారు.
మా ఘనతేనని లోకేశ్ ట్వీట్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే.. EODBలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 2018- 2019లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి ర్యాంకు రావటం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనం అని లోకేశ్ పేర్కొన్నారు. లోకేశ్ ట్వీట్ చూసి ఆశ్చర్యపోయానని మేకపాటి తెలిపారు.