తెర పైకి ఓటుకు నోటు కేసు: ఎర్లీ హియరింగ్ చేపట్టాలంటూ: సుప్రీంలో ఎమ్మెల్యే ఆర్కే పిటీషన్..!
కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేయటంతో పాటుగా..జాతీయ స్థాయిలో సంచలనానికి కారణమైన ఓటు కు నోటు కేసు మరో సారి తెర మీదకు వచ్చింది. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించిన చంద్రబాబు పైన అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ఎత్తివేసి విచారణ ప్రారంభించింది. దీంతో..ఇదే సరైన సమయంగా భావిస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో గతంలోనే ఎమ్మెల్యే సుప్రీంను ఆశ్రయించినా లిస్టింగ్ కూడా కాలేదు. దీంతో..ఇప్పుడు తిరిగి మరోసారి సుప్రీంలో ఈ కేసుకు సంబంధించి ఎర్లీ హియరింగ్ పిటీషన్ ను దాఖలు చేసారు. దీని ద్వారా ఈ కేసు పైనా సుప్రీం కోర్టు ఏ రకంగా స్పందిస్తుందీ..విచారణ చేపడుతుందా.. ఏ రకమైన పరిణామాలకు కారణం అవుతుందనే చర్చ మొదలైంది.
సుప్రీంలో ఓటుకు నోటు వ్యవహారం..
2015 లో తెలుగు రాష్ట్రాల్లో కలకలానికి కారణమైన ఓటుకు నోటు వ్యవహారం ఇప్పుడు మరో సారి తెర మీదకు వచ్చింది. 2015లో టీడీపీ మహానాడు సమయంలో నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధికి మద్దతుగా ఓటు వేయాలని కోరుతూ నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 50 లక్షల లంచం ఇవ్వటానికి ప్రయత్నించినట్లు వీడియో టేపులు హల్ చల్ చేసాయి. అదే సమయంల ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు సైతం ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి. దీంతో..అప్పుడు రేవంత్ రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఆ వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అది..న్యాయపరంగా విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
ఇదే కేసులో సుప్రీం కెళ్లిన ఆర్కే..
ఇదే కేసుకు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పైన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే సుప్రీంలో కేసు దాఖలు చేసారు. అందులో ఆయన దాఖలు చేసిన పిటీషన్ లో పలు అంశాలను ప్రస్తావించారు. ఛార్జిషీట్ లో 52సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ.... ఎఫ్ఐఆర్ల్లో మాత్రం చేర్చలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందంటూ ఆర్కే పిటిషన్ను కొట్టివేయడంతో.... ఆయన సుప్రీంలో సవాలు చేశారు. ఆర్కే పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.... వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకి నోటీసులిచ్చింది. ఆ తరువాత ఇది ఏసీబీ కోర్టు..హైకోర్టులో విచారణలో ఉండటంతో సుప్రీం కోర్టు లో లిస్టింగ్ కాలేదు. దీంతో..అప్పటి నుండి ఈ కేసు పైన అనేక రకాలుగా ఎమ్మెల్యే ఆర్కే న్యాయ పరంగా సలహాలు తీసుకుంటూనే ఉన్నారు.
మరోసారి సుప్రీంలో ఎర్లీ హియరింగ్ పిటీషన్..
తెలంగాణ ప్రభుత్వం అప్పుడప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులో సమీక్ష జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆర్కే తన పిటీషన్ లో సైతం ప్రస్తావించారు. తాజాగా 14 ఏళ్ల క్రితం విధించిన స్టేను ఎత్తివేస్తూ ఏసీబీ కోర్టులో 14 ఏళ్ల క్రితం చంద్రబాబు అక్రమాస్తుల పైన లక్ష్మీ పార్వతి దాఖలు చేసిన పిటీషన్ పైన కోర్టు విచారణ మొదలు పెట్టింది. దీంతో..ఇదే సమయంలో మరోసారి ఎమ్మెల్యే ఆర్కే మరోసారి ఓటు కు నోటు కేసు పైన సుప్రీంను ఆశ్రయించారు. ఈ సారి ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు స్వీకరిస్తే..ఈ కేసు సంబంధించి మరోసారి కీలకమైన అంశాల పైన విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే, సుప్రీం ఈ పిటీషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
రాజకీయంగా కలకలం..
అప్పట్లోనే ఈ వ్యవహారం రాజకీయంగా కలకలానికి కారణమైంది. ఆ కేసు కారణంగా నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్ వదిలి అమరాతికి వచ్చారంటూ ఇప్పటికీ రాజకీయంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కు ఏసీబీ ఉంటే తనకు ఏసీబీ ఉందని..తన మీద కేసు పెడితే..తాను కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించారు. దీనికి అనుగుణంగానే ఈ వ్యవహారం మీద నాడు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, కాలక్రమేణా మారిన పరిణామాలతో మొత్తం వ్యవహారం సద్దు మణిగింది. ఇక, ఇప్పుడు చంద్రబాబు అధికారంలో లేకపోవటంతో..తాజాగా ఆర్కే వేసిన పిటీషన్ విషయంలో సుప్రీం ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది. త్వరిత గతిన విచారణ కోసమే ఆర్కే ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు.