పెట్రోల్ బంక్లో పేలిన ఫోన్.. చెలరేగిన మంటలు..!
సత్తెనపల్లి : పెట్రోల్ బంకుల్లో సెల్ఫోన్లు వాడొద్దని ఎందరు మొత్తుకుంటున్నా ప్రజల్లో అవగాహన పెరగడం లేదు. చీటికి మాటికి ఫోన్లలో మునిగిపోయే వారైతే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంకులు, పేలుడు పదార్థాలు ఉన్న చోట మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించాలనే నిపుణుల సూచనలు తుంగలో తొక్కుతున్నారు. దాంతో కొన్నిసార్లు ప్రమాదాలు తప్పడం లేదు. గుంటూరు జిల్లాలో తాజాగా జరిగిన ఘటన జనాల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని ఓ పెట్రోల్ బంక్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో పెట్రోల్ కొట్టించుకుందామని వచ్చిన వాహనదారులతో పాటు అక్కడున్న జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఊహించని ఘటనతో షాక్ తిన్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు దిగారు. అయితే వెంటనే తేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. లేదంటే ప్రమాద తీవ్రత అంచనా వేయడం కష్టం అంటున్నారు స్థానికులు.
మా పొట్ట కొట్టొద్దు.. మద్దతు ఇవ్వండి.. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
ఇద్దరు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకోవడానికి సదరు పెట్రోల్ బంక్కు వచ్చారు. అయితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోస్తున్న సమయంలో వెనుక కూర్చున్న వ్యక్తి మొబైల్ ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడున్నవారికి ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చివరకు పెట్రోల్ బంక్ సిబ్బంది తేరుకుని మంటలు అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. తెలిసి కూడా చేసే తప్పులు చివరకు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో అనడానికి ఈ ఉదంతం చక్కటి ఉదహరణగా నిలుస్తోంది.