డ్రైవర్ ఏమాత్రం పసిగట్టకుండా... కదులుతున్న కంటైనర్ నుంచి 980 మొబైల్ ఫోన్లు చోరీ...
గుంటూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. బుధవారం(సెప్టెంబర్ 16) మంగళగిరి-గుంటూరు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్ నుంచి రూ.80లక్షల విలువైన మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. కంటైనర్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. కంటైనర్ నుంచి మొత్తం 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు సమాచారం.
నిజానికి చోరీ జరిగిన విషయాన్ని కంటైనర్ డ్రైవర్,క్లీనర్ గుర్తించకపోవడం గమనార్హం. కంటైనర్ వెనకాల వెళ్తున్న ఓ వాహనదారుడు కంటైనర్ వెనుక డోర్ తీసి ఉండటాన్ని గమనించి డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. కొద్ది దూరంలోని కాజా టోల్ గేట్ సమీపంలోకి వెళ్లాక డ్రైవర్ కంటైనర్ను రోడ్డుపై నిలిపి కిందకు దిగాడు. వెనక వైపు వెళ్లి చూడగా కంటైనర్ డోర్ తీసి ఉండటం గమనించాడు. అందులో నుంచి భారీ ఎత్తున సెల్ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో క్లీనర్తో కలిసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
అనంతరం గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆ కంటైనర్ వద్దకు చేరుకుని పరిశీలించారు. దారి దోపిడీ ముఠాయే ఈ చోరీకి పాల్పడి ఉంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ముఠానే ఈ దోపిడీకి పాల్పడవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.
Recommended Video
కాగా,డ్రైవర్,క్లీనర్ ఏమాత్రం పసిగట్టకుండా కదులుతున్న కంటైనర్ నుంచి దుండగులు మొబైల్ ఫోన్లను ఎలా చోరీ చేశారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది పక్కా దారి దోపిడీలో ఆరితేరినవాళ్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. విచారణలో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.