మహిళా ఎస్సై పై నన్నపునేని అనుచిత వ్యాఖ్యలు .. విధుల నుండి వెళ్ళిపోయిన మహిళా ఎస్సై
చలో ఆత్మకూరు' ను అడ్డుకునే క్రమంలో భాగంగా టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు . ఇక ఛలో ఆత్మకూరుకు అనుమతి లేని నేపథ్యంలో, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు ఛలో ఆత్మకూరు నిర్వహించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు . పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్న టిడిపి నేతలు అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా సాటి మహిళ అని కూడా చూడకుండా టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలతో ఓ మహిళా ఎస్సై మనస్థాపం చెంది విధుల నుంచి వెళ్ళిపోయింది.
టీడీపీ నేత చింతమనేని అరెస్ట్ .. దుగ్గిరాలలో ఉద్రిక్తత
చంద్రబాబు నివాసం వద్ద టిడిపి నేతలు పోలీసుల తీరుపై వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నన్నపనేని రాజకుమారి 'దళితుల వల్లనే దరిద్రం' అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్ఐ అనురాధపై నోరు జారి మాట్లాడారని సమాచారం .
నన్నపనేని వ్యాఖ్యలతో మనస్థాపానికి గురైన మహిళా ఎస్సై అనురాధ విధుల నుండి వెళ్లిపోయారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఇక అంతే కాదు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. ఏదేమైనప్పటికీ నేడు కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులపై దుర్భాషలాడిన, దురుసుగా ప్రవర్తించిన మరికొందరు నేతలపై కేసు నమోదు కానున్నాయి అని తెలుస్తుంది.