‘తండ్రి శవాన్నే తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడా?’
హైదరాబాద్/అమరావతి: టీటీడీ ఆస్తుల విక్రయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, టీటీడీ మాజీ ఈవో, ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తుల విక్రయాలు, తిరుమల శ్రీవారి లడ్డూలు బహిరంగ మార్కెట్లో అమ్మకం సరికాదని ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ తరహా చర్యలు అర్థం లేనివని దుయ్యబట్టారు.
కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?
రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు..
దాతలు ఇచ్చిన ఆస్తులు అమ్మాలన్న నిర్ణయం సరికాదని ఐవైఆర్ హితవు పలికారు. ఆలయాలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. దేశమంతా స్తిరాస్థి రంగం కోలుకోని పరిస్థితితో ఉంటే ఆస్తులను విక్రయానికి పెడతారా? అంటూ ఐవైఆర్ నిలదీశారు.
అప్పట్లో హడావుడి చేసి.. ఇప్పుడిలానా?
సదావర్తి భూముల అమ్మకంపై అప్పట్లో హడావుడి చేసిన ప్రస్తుత అధికార పార్టీ.. ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందని ప్రశ్నించారు. దాతలు ఇచ్చేటప్పుడు తీసుకుని అమ్మేస్తామంటే సరైన పద్ధతా? అని ధ్వజమెత్తారు. కాగా, తమిళనాడులో 23 చోట్ల ఉన్న శ్రీవారి భూములు వేలం వేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. టీటీడీ నిర్ణయంపై రాజకీయ నేతలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎంవో నుంచే అప్పుడూ.. ఇప్పుడూ..
కాగా, అన్యమత ప్రచారం ప్రభుత్వాలకు సంబంధం లేకుండా జరుగుతోందని, హిందూ మత పరిరక్షణ బాధ్యత, ప్రచార బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఐవైఆర్ అన్నారు. అప్పడూ ఇప్పుడూ సీఎంవో నుంచే టీటీడీ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయని ఐవైఆర్ చెప్పారు. టీటీడీ బోర్డును పునర్ వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. భక్తిభావం ఉన్నవారిని సభ్యులుగా చేర్చాలని, ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని ఐవైఆర్ సూచించారు.
పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి..
ఏపీ సీఎం జగన్పై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దేవుడి మాన్యాలను వదిలిపెడతాడు అనుకోవడం అత్యాశే అవుతుంది. భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీ వారికే ఉంది. గోవిందా... గోవింద' అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు నారా లోకేష్.