ఆస్తులు కాపాడుకునేందుకే పార్టీ మార్పు.. వల్లభనేని వంశీపై భగ్గుమన్న నారా లోకేష్
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఆస్తులను కాపాడుకునేందుకే పార్టీ మారుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ అన్నారు. వంశీ పార్టీ మారడం వల్ల టీడీపీకి ఎలాంటీ నష్టం లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ వైఫల్యాలపై మాట్లాడిన వంశీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారం క్రితమే తనతో మాట్లాడిన వంశీ ఇప్పుడు విమర్శలు చేస్తాడా అంటూ ప్రశ్నించారు. టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్పై వంశీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్సెన్షన్ వేటు.. టీడీపీ కఠిన నిర్ణయం
ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ.. నిన్నటివరకు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఆయన తిరిగి అదే పార్టీలోకి ఎలా వెళతాడని దుయ్యబట్టారు. మరోవైపు వంశీ చెప్పిన వెబ్సైట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో రాస్తే... తాను ఎలా సమాధానం చెబుతానని అన్నారు. ఆ వెబ్సైట్ తనదని ఎవరైనా నిరూపించండంటూ సవాల్ విసిరారు. ఇంతకు ముందు తనపై ఒత్తిడి వస్తుందని చెప్పిన వంశీ, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి టీడీపీపై విమర్శలు చేశారని అన్నారు. ఇక పార్టీపై విమర్శలు చేసిన వంశీ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మళ్లి గెలవలేకే టీడీపీపై బురద జల్లాడని అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ వంశీ పార్టీ మార్పుపై స్పందించారు.
కాగా టీడీపీ తనపై వ్యక్తిగతంగా కక్షగట్టి లోకేష్కు సంబంధించిన వెబ్ సైట్లలో తప్పుడు వార్తలు రాయించారని గురువారం జరిగిన ప్రెస్ మీట్లో వంశీ తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పుడు వార్తలపై చంద్రబాబునాయుడును సైతం సంప్రదించానని, అయినా... సమాధానం రాలేదని తెలిపారు. ఇక లోకేష్పై కూడ వంశీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. ఆయనకు వర్దంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడేవారు నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు.