జగన్ గారూ! ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు తెలుసా?: లోకేష్ సెటైర్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించిన వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
భయపడుతున్నారంటూ..
‘వైఎస్సార్ వాహన కక్ష పథకం చూసి ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు @ysjagan గారూ. మీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, అడుగుతున్న సర్టిఫికెట్ల కోసం తిరిగే డబ్బుతో కొత్త ఆటో కొనుక్కోవచ్చట. రాష్ట్రంలో సుమారుగా 6.63 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు అని ఒక లెక్క' అని ఎద్దేవా చేశారు లోకేష్.
ఏం సందేశం ఇస్తున్నారు?
‘అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలుకు రూ.663 కోట్లు కేటాయించాలి. అలాంటిది ప్రభుత్వమే రూ.400 కోట్లు మంజూరు చేసిందంటే అర్థం ఏమిటి? అర్హులను తగ్గించమనే కదా! అధికారులు ఇంకాస్త ముందుకెళ్ళి 1.73 లక్షలకు కుదించారు' అని వ్యాఖ్యానించారు.
మోసం కాదా?
‘మ్యానిఫెస్టోలో చెప్పని నిబంధనలన్నీ పథకం అమలు చేసేటప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి జగన్ గారూ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? లేక మోసం చెయ్యడం మీకు కొత్త కాదు కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే చేసాం అంటారా? సమాధానం చెప్పండి' అంటూ నారా లోకేష్ నిలదీశారు.