వైసీపీ ‘గ్రామ వాలంటీర్లు హ్యాట్సాఫ్’: నారా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేగాక, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వాలంటరీ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ తుగ్లక్ పాలనలో..
‘తెలుగు రైతు వర్క్ షాప్లో పాల్గొన్నాను. తుగ్లక్ 9 నెలల్లో 350 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. జగన్ రైతు వ్యతిరేకి. గతంలో రైతు రుణమాఫీ అవసరం లేదు అన్నారు, ఇప్పుడు అనేక హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు' అని నారా లోకేష్ విమర్శించారు.
జగన్ సర్కారులో రైతులకు లాఠీదెబ్బలు..
‘రైతుకి విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. విత్తనాల కోసం రైతులు లైన్ల లో నిలబడి లాఠీ దెబ్బలు తినే రోజులు తెచ్చారు. సున్నా వడ్డీకే రుణాలు అంటూ గతంలో లేని పథకంలా హడావిడి చేసి దొరికిపోయారు. సున్నా వడ్డీ దేవుడెరుగు అసలు రుణాలు ఇస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది' అంటూ నారా లోకేష్ వైసీపీ సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జగన్ చెప్పిందొకటి.. చేసేదొకటి..
‘3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం అని మ్యానిఫెస్టో లో పెట్టారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. 12,500 రైతు భరోసా అని 7,500 మాత్రమే ఇస్తున్నారు. ఇలా అనేక ఇబ్బందుల్లో రైతులు కూరుకుపోతున్నారు. రైతులకు అండగా ఉంటూ వారి తరపున పోరాడాలి అని తెలుగు రైతు విభాగానికి దిశానిర్దేశం చేశాను' అని నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు.
దండుపాళ్యం గ్యాంగుల్లా అంటూ..
‘90 శాతం వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు. వారు రేపులు చేసినా, పాపాలు చేసినా వైకాపా ఆశీస్సులున్నాయని అర్థం అవుతోంది. వైఎస్ జగన్ గారు అప్పగించిన బాధ్యతలను దండుపాళ్యం గ్యాంగుల్లా పూర్తిచేస్తున్న వాలంటీర్లకు వైకాపా హ్యాట్సాఫ్ చెప్పడంలో వింతేముంది?' అని నారా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.