నారా లోకేశ్ అరెస్టుకు సిద్ధం.. మంగళగిరి స్టేషన్లో హల్చల్.. పోలీసులపైనా కేసులంటూ వార్నింగ్
సోషల్ మీడియా వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులు మీమ్స్తో పరస్పరం దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఏపీలో చాలా జోరుగా సాగుతోన్న ఈ వ్యవహారంలో పలు అరెస్టులు కూడా చోటుచేసుకున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసపై ఫేస్ బుక్ లో సెటైరికల్ పోస్టు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త నయబ్ రసూల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ను పర్యవేక్షించే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రసూల్ అరెస్టు వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కార్యకర్తకు అండగా తాను కూడా అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని లోకేశ్ ప్రకటించారు. ఆ క్రమంలోనే మంగళగిరి స్టేషన్కు వచ్చి హల్ చల్ చేశారు..
మహిళల మార్ఫింగ్ ఫొటోలు..
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, లాయర్ కిషోర్ ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ నేత తురకా కిషోర్ దాడి చేయడం, ఆ కేసులో ఆయనకు పోలీసులు.. స్టేషన్ బెయిల్ ఇచ్చిమరీ, ఎన్నికల్లో నామినేషన్ వేసేలా చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నారా లోకేశ్ అదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ నేతలపై హత్యయత్నం చేసినవాళ్లకు స్టేషన్ బెయిల్ ఇస్తారుకానీ, టీడీపీ మహిళా నేతలను దారుణంగా అవమానిస్తూ మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు పెట్టే వైసీపీ శ్రేణులపై మాత్రం చర్యలు ఉండవని మండిపడ్డారు.
నన్ను కూడా అరెస్టు చేయండి..
టీడీపీ కార్యకర్త రసూల్ అరెస్టును నిరసిస్తూ పార్టీ కార్యదర్శి నారా లోకేశ్ ‘‘నన్ను కూడా అరెస్టు చేయండి'' హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభించారు. నారా లోకేశ్ అనే తాను అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. ‘‘తుగ్లక్ తీసుకుంటున్న చెత్త నిర్ణయాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడితే అర్ధరాత్రులు అరెస్టు చేస్తారా? సీఎం జగన్ గారు మీకు సిగ్గులేదా?''అని లోకేశ్ ఫైరయ్యారు. పార్టీ నేతలతో కలిసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆందోళన నిర్వహించారు.
కేసులతో కొడతాం..
ఒకప్పుడు ఎంతో హుందాగా వ్యవహరించిన పోలీసు వ్యవస్థ.. జగన్ సీఎం అయిన తర్వాత భ్రష్టుపట్టిపోయిందని నారా లోకేశ్ ఆవేదన చెందారు. వైసీపీ పాలనలో పోలీసులు ప్రతిసారి కోర్టు ముందు దోషులుగా నిలబడే పరిస్థితి నెలకొందని, చిటికీ మాటికీ జడ్జిల చేత చివాట్లు తింటున్నారని గుర్తుచేశారు. చట్టాన్ని ఉల్లంఘించి, వైసీపీకి అనుకూలంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతోన్న పోలీసు అధికారులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, ప్రైవేట్ కేసులు దాఖలుచేసి కోర్టులకు ఈడ్చుతామని లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
స్టేషన్లో హల్ చల్..
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త రసూల్ ను విడుదల చేయాలంటూ నారా లోకేశ్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. ఎమ్మెల్సీలు అశోక్ బాబు, దీపక్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ తోపాటు పెద్ద సంఖ్యలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా స్టేషన్ కు వచ్చారు. ఏ తప్పూ చేయని తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలంటూ లోకేశ్.. ఎస్హెచ్వోతో చాలా వాదించారు. ఎంతకీ ఫలితం రాకపోవడంతో, పోలీసులపైనా కేసులు పెడతామని హెచ్చరించి అక్కణ్నుంచి వెళ్లిపోయారు.