గుంటూరులో నారా లోకేష్ ఇసుక దీక్ష .. భారీగా పాల్గొన్న కార్మికులు
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ నేత నారా లోకేశ్ ఇసుక దీక్ష చేపట్టారు. గుంటూరులో చేపట్టిన ఈ దీక్షకు భారీ ఎత్తున తెలగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట నారా లోకేష్ చేపట్టిన ఇసుక దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. నారా లోకేష్ ఇసుక దీక్షకు సంఘీభావంగా పార్టీ నేతలు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తదితరులు దీక్షలో పాల్గొన్నారు. అంతేకాదు లోకేష్ చేస్తున్న దీక్షకు భవన నిర్మాణ కార్మికులు కూడా తమ మద్దతు ప్రకటించారు. భారీ సంఖ్యలో కార్మికులు దీక్షలో పాల్గొంటున్నారు.
ఇసుక కొరతపై ఆందోళన.. లోకేష్ నిరాహార దీక్ష
ఏపీలో కృత్రిమ ఇసుక కొరత ప్రభుత్వ వైఫల్యం వల్లే కలిగిందని నారా లోకేష్ మండిపడ్డారు. ఇసుక కొరత సృష్టించి వైసిపి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపణలు చేశారు. ఇసుక కొరత చోటు చేసుకోవడం వల్ల నిర్మాణ రంగంలో పనులు లేక నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కనీసం నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలపై జగన్ ఒక్కసారైనా సమీక్ష జరిపారా ? దీనికి పరిష్కారాన్ని వెతికారా అని నారా లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇసుక కొరతపై టిడిపి ఇప్పటికే ఉదృతంగా ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వద్దని త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నా తీవ్రంగా మారిన ఇసుక సమస్య అంత ఈజీగా పరిష్కారమయ్యే మార్గం కనిపించడం లేదు. ఇప్పటికే నారా లోకేష్ పలుమార్లు ఇసుక కొరత విషయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా ముఖంగా ఎండగట్టారు. ఇక నేడు గుంటూరు కలెక్టరేట్ ముందు ఇసుక సమస్య పరిష్కరించలేని ప్రభుత్వ వైఖరికి నిరసనగా మెడలో నల్ల కండువా ధరించి ఒకరోజు ఇసుక దీక్ష చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి దీక్ష ప్రారంభించిన లోకేష్ ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ఉత్తమ ఆదుకోవాలని, ఇసుక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.