రంగనాయకమ్మ పోస్ట్ షేర్ చేసిన లోకేష్- అరెస్టు చేసుకోండని జగన్ సర్కారుకు సవాల్...
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త రంగనాయకి ఫేస్ బుక్ లో చేసిన వివాదాస్పద పోస్టును టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు తనను అరెస్టు చేసుకోవాలని జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఓవైపు రంగనాయకి పోస్ట్ పై సీఐడీ విచారణ కొనసాగుతున్న తరుణంలో నారా లోకేష్ చర్య కలకలం రేపుతోంది. ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టేలా ఇది కనిపిస్తోంది.
సోషల్ మీడియా అనగానే వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలవుతుందని, అసమర్ధ పాలన సోషల్ మీడియా ద్వారా బయటికి వస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోందని లోకేష్ ట్విట్టర్ లో విమర్శించారు. అంతే కాకుండా అరెస్ట్ మీ టూ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా తన పోస్టుకు తగిలించారు. దీంతో అసలే సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై గుర్రుగా ఉన్న ఏపీ సీఐడీ లోకేష్ ను ఏం చేస్తుందో చూడాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.