సత్తెన పల్లిలో కోడెలపై ప్రతిపక్ష నేతల దాడి..! ఖండించిన వైసీపి..!!
Recommended Video
గుంటూరు/హైదరాబాద్ : ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం, అదికార పక్షం నేతల మద్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపి ఎన్నికల సరళి భూతల యుద్దాన్ని తలపిస్తోంది. అభ్యర్థి ఎంత ఉన్నత పదవిలో ఉండి పోటీ చేస్తున్నా నేతలు లెక్క చేయడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద టీడిపి నేతలు, టీడిపి నేతల మీద వైసీపి నేతలు రెచ్చిపోతున్నారు. ఇక వైసిపి నేతలు ఓ అడుగు ముందుకేసి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్టు సమాచారం.
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి కి పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు స్పీకర్ కోడెల చొక్కా చింపేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ సమయంలో ఆయనకు రక్షణగా నిలిచిన గన్మెన్లపై రాళ్లతో దాడి చేసినట్టు సమాచారం. దీంతో రక్షణ సిబ్బందికి తీవ్రగాయాలయినట్టు కూడా తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గాయపడ్డ స్పీకర్ కోడెల ఫోటో మాత్రం వైరల్ గా మారింది. కాగా తాము ఏ అదికార పార్టీ నేతల జోలికి వెళ్లలేదని, ఎవరిపైన కూడా బౌతిక దాడులకు పాల్పడలేదని గుంటూరు వైసిపి నేతలు చెప్పుకొస్తున్నారు.