పంచాయితీ నామినేషన్ల దాఖలుకు వచ్చిన అభ్యర్థులు వెనక్కి , గుంటూరులో అందుకు భిన్నంగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగాల్సిన తరుణంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలి విడత నామినేషన్లను ఈరోజు నుంచి స్వీకరించాల్సి ఉంది. మొదటి విడతలో 11 జిల్లాల్లోని 14 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు మొదలు కాలేదు. అటు అధికారులు నామినేషన్ల స్వీకరణకు సిద్ధం కాలేదు. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
నామినేషన్లకు వచ్చిన అభ్యర్థులను తిప్పి పంపించేస్తున్న అధికారులు
నామినేషన్లకు తొలిరోజున ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఫీసులకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే అధికారులు నామినేషన్ లకు ఏర్పాట్లు చేశారు.మిగతా చోట్ల ఎక్కడా నామినేషన్ల హడావిడి లేదు . అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన షమీన్ తాజ్ అనే అభ్యర్థి నామినేషన్ల దాఖలుకు వెళ్లిన నేపథ్యంలో, నామినేషన్ పత్రాలు రాలేదని అభ్యర్థికి కార్యాలయం అధికారులు చెప్పి తిప్పి పంపించేశారు. ఇక సోమందేపల్లి లో కూడా నామినేషన్ దాఖలుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత అక్కడ ఎవరూ లేకపోవటంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
నామినేషన్లకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు , టీడీపీ ఆందోళన
నామినేషన్లు దాఖలు చేయడానికి ఒకపక్క ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి పై గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలు అసలు రాష్ట్రంలో ఎన్నికలే జరగవు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట లో నామినేషన్లు స్వీకరించకపోవడంతో టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
గుంటూరు జిల్లాలో హడావిడి లేకుండా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు , ఇతర జిల్లాల్లో నామినేషన్ లకు డిమాండ్
ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు హడావుడి ఏమీ లేకుండా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల పత్రాలు పంచాయతీ కార్యాలయాలకు కూడా చేరుకున్నాయి .ఈ క్రమంలో నామినేషన్లు తీసుకునేందుకు అధికారులకు బాధ్యతలను కేటాయించారు. ఈ క్రమంలో ఇతర జిల్లాలలో కూడా నామినేషన్లు తీసుకోవాలని విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితి, పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన మరికాసేపట్లో సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది.