హాయ్ ల్యాండ్ ముట్టడికి అగ్రిగోల్డ్ బాధితుల యత్నం విఫలం; ముందస్తు అరెస్టులు..ఖండించిన సిపిఐ
గుంటూరు:హాయ్ ల్యాండ్ ముట్టడించాలన్న అగ్రి గోల్డ్ బాధితుల యత్నాన్ని పోలీసులు ఆదిలోనే భగ్నం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదన్న పోలీసులు...ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సిపిఐ నేతలతో పాటు అగ్రి గోల్డ్ బాధితులను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
బుధవారం హాయ్ ల్యాండ్ ముట్టడికి అగ్రి గోల్డ్ బాధితులు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అంతేకాకుండా అగ్రి గోల్డ్ బాధితులు హాయ్ ల్యాండ్ వద్దకు చేరుకోకుండా నిలువరించేందుకు పోలీసులు గుంటూరు- విజయవాడ రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల కోసం ప్రభుత్వం కుట్ర: కన్నా;వైసిపిది ఆ డ్రామా...బిజెపిది ఈ డ్రామా:బుద్ధా వెంకన్న
ఈ క్రమంలో గుంటూరు, విజయవాడ వైపు నుంచి హాయ్ ల్యాండ్ కు తరలివస్తున్న పలువురు సీపీఐ, అగ్రిగోల్డ్ బాధిత సంఘం నేతలను గుర్తించి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హయ్ ల్యాండ్ ముట్టడి కార్యక్రమం నిర్వహించి తీరుతామని ఈ సందర్బంగా అరెస్ట్ అయిన సీపీఐ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుల అరెస్ట్లను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ బాధితుల అరెస్ట్ సమాచారం తెలిసిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ...ఆస్తులను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అగ్రి గోల్డ్ విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై రామకృష్ణ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, అందువల్లే తమతో కలిసి వచ్చే పార్టీలతో డిసెంబర్ 2న విజయవాడలో రాజకీయ సభ నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. తదనంతరం న్యూడిల్లీ వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎపి విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు.