నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..అతని పని అదే:
గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్యకేసు మిస్టరీని మంగళగిరి పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు శ్రీనివాస రావే హంతకుడని నిర్ధారించారు. జ్యోతిని హత్య చేసిన తరువాత, కేసును పక్కదారి పట్టించడానికి తనకు తానే తలపై గాయం చేసుకున్నాడని పోలీసులు ధృవీకరించారు. శ్రీనివాస రావును అరెస్టు చేశారు. అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. జ్యోతిని హత్య చేయడానికి సహకరించిన శ్రీనివాసరావు స్నేహితుడు పవన్ కూడా అరెస్టు అయ్యారు. తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతి ఒత్తిడి తీసుకుని రావడం వల్లే శ్రీనివాస్ ఆమెను హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ విజయారావు తెలిపారు. శ్రీనివాస్ కు పలువురు అమ్మాయిలతో శారీరక సంబంధం ఉందని అన్నారు. వారి నగ్న ఫొటోలు, వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడని చెప్పారు.
మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్ షిప్ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో కొద్దిరోజుల కిందట పోలీసులకు జ్యోతి మృతదేహం లభించిన విషయం తెలిసిందే. ఆమె ప్రియుడు శ్రీనివాస్ కూడా సంఘటనాస్థలంలో తలకు గాయాలతో కనిపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తన ప్రియురాలు జ్యోతి హత్యకు గురైందని అన్నారు. జ్యోతిని హత్య చేస్తుండగా.. తాను అడ్డుపడ్డానని, ఈ సందర్భంగా తనకు తలపై గాయమైందని శ్రీనివాస్ వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎంత లోతుగా దర్యాప్తు చేపట్టినప్పటికీ.. పోలీసులకు ఎలాంటి లీడ్ కూడా దొరకలేదు. జ్యోతి బంధువులను కూడా ప్రశ్నించారు. అక్కడా వారికి అనుమానాస్పద కదలికలు ఏవీ కనిపించలేదు.
దీనితో వారికి శ్రీనివాస్ పై అనుమానాలు తలెత్తాయి. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వేసిన ప్రశ్నలకు అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీనితో అతనిపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అరెస్టు చేసి, తమదైన శైలిలో ప్రశ్నించగా, అసలు విషయాన్ని అంగీకరించాడు. తానే జ్యోతిని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. పెళ్లి చేసుకోవాలని తనను తీవ్రంగా ఒత్తిడికి గురి చేసిందని, వదిలించుకోవడానికే ఆమెను హత్య చేసినట్లు చెప్పాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గురించి ఆరా తీసిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి.
పలువురు యువతులతో అతనికి శారీరక సంబంధాలు ఉన్నట్లు తేలింది. ప్రేమ పేరుతో తనను నమ్మి వచ్చిన యువతులను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, సెల్ ఫోన్ ద్వారా వారిని నగ్నంగా చిత్రీకరించే వాడని వెల్లడైంది. అనంతరం వాటిని చూపించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. జ్యోతిని కూడా ఈ రకంగానే వేధించాడని అన్నారు. ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకుని రాగా, వదిలించుకోవాలనే ఉద్దేశంతో అమరావతి టౌన్ షిప్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశాడని స్పష్టం చేశారు. అప్పటికే అక్కడ దాచి ఉంచిన ఇనుప రాడ్ తో జ్యోతి తలపై మోది హత్య చేశాడని అన్నారు. ఇందుకు అతని స్నేహితుడు పవన్ సహకరించాడని అన్నారు. వారిద్దరూ కలిసి జ్యోతి హత్యపై రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.