వైసీపీ ఎమ్మెల్యేపై రాష్ట్రపతికి ఫిర్యాదు: విచారణ చేయాలని సీఎస్ కు ఆదేశాలు..!
ఏపీ అధికార పార్టీలో మరో ఎమ్మెల్యే వ్యవహారం ఢిల్లీ దాకా చేరింది .ఏకంగా రాష్ట్రపతికి ఫిర్యాదు అందింది. దీంతో..దీని పైన విచారణ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి కార్యాలయం అదేశించటం తో ఇప్పుడు అధికార పార్టీలో కలకలం మొదలైంది. దీంతో..వినాయక చవితి నాడు తనను కులం పేరుతో దూషించారంటూ ముఖ్యమంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేసారు. ఆ తరువాత వారి పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఎమ్మెల్యే పెట్టిన కేసు కూడా చెల్లదనే వాదన మొదలైంది. రాష్ట్రపతి భవన్ స్వయంగా జోక్యం చేసుకోవటం..దీని పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నేరుగా విచారణకు ఆదేశించటం తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
జాతీయ మహిళా కమీషన్ ను ఆశ్రయించిన ఎమ్మెల్యే శ్రీదేవి .. డీజీపీకి నోటీసులు జారీ చేసిన కమీషన్
ఎమ్మెల్యే శ్రీదేవిపై ఫిర్యాదు..
ఏపీ రాజధాని పరిధిలోని తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కుల ధ్రువీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్ దాఖలయ్యాయి. తాను క్రిస్టియన్ అని... తన భర్త కాపు కులస్థుడని వ్యాఖ్యానించిన విషయంపై లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరానికి చెందిన వారు దృష్టిసారించారు. చట్ట ప్రకారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్ హక్కులు కోల్పోతారని ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు. తాను ఎస్సీనని ఎన్నికల కమిషన్కు డాక్టర్ శ్రీదేవి తప్పుడు ధ్రువీకరణను దాఖలు చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరానికి చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా రాష్ట్రపతికి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.
విచారణపై సీయస్ కు ఆదేశం
తమ వద్దకు వచ్చిన ఫిర్యాదు పైన రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. లీగల్ రైట్స్ ప్రొటక్షన్ ఫోరం శ్రీదేవి ఎన్నిక చెల్లదనే వాదిస్తోంది. రిజర్వ్ నియోజకవర్గమైన తాడికొండ నుండి అసలు పోటీకి శ్రీదేవికి అర్హత లేదనేది వారి వాదన. అందునా ఇప్పుడు నేరుగా రాష్ట్రపతి భవన్ వర్గాలు జోక్యం చేసుకోవటంతో ఈ వివాదం చివరికి ఎక్కడకు చేరుతుందనే ఉత్కంఠ పార్టీలో మొదలైంది. గుంటూరు జిల్లాలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో వైసీపీ 15 స్థానాలు దక్కించుకుంది. అందులో రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉండే తాడికొండ నియోజకర్గం పైన టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు టీడీపీ ఇదే అంశాన్ని రాజకీయంగా వినయోగించుకొనే అవకాశం ఉంది.
ఆ కేసులు చెల్లవంటూ..
వినాయక చవితి వేడుకల్లో తనను కులం పేరుతో కొందరు దూషించారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ శ్రీదేవి తుళ్ళూరు పోలీ్సస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు దాఖలు చేశారు. ఈ సంఘటనపై సీఎం జగన్ కులపరమైన ధూషణలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే సూచించిన కొందరు టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా శ్రీదేవి వ్మవహారం పైన రగడ మొదలు కావటంతో..అసలు శ్రీదేవి పెట్టిన కేసులు కూడా చెల్లవని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం శ్రీదేవి కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఎస్సీ కాదంటూ శ్రీదేవి పైన ఇప్పుడు దాఖలైన పిటీషన్ల పైన రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.