గుంటూరు వద్ద రోడ్డు ప్రమాదం: స్పాట్లో ప్రత్యక్షమైన మంత్రి క్షతగాత్రులను ఆసుపత్రికి
గుంటూరు: గుంటూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ఆసుప్రతికి తరలించారు. దీనికోసం ఆయన స్వయంగా అంబులెన్స్కు ఫోన్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు వద్ద అయిదో నంబర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని తడ నుంచి వలస కార్మికులను తీసుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి బయలుదేరిన మినీ బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. వలస కార్మికులను ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్ఛాపురంలో దింపిన అనంతరం నెల్లూరు జిల్లాకు తిరుగుముఖం పట్టింది. మార్గమధ్యలో గుంటూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.
అదే సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి విజయవాడకు వెళ్తూ.. ఈ ప్రమాదాన్ని చూశారు. వెంటనే స్పందించారు. అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వాహనం నుంచి బయటికి తీసుకుని రావడంలో సహకరించారు. అంబులెన్స్ వచ్చేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.