నారా లోకేష్ దీక్షపై రోజా సెటైర్లు: వేధిస్తున్నారంటూ నారా లోకేష్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యను తీర్చాలంటూ టీడీపీ నేత నారా లోకేష్ చేసిన దీక్షపై వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కు రోజా తనదైన శైలిలో స్పందించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక కొరతకు టీడీపీ అధినే చంద్రబాబు నాయుడు, లోకేష్లే కారణమని అన్నారు.
లోకేష్పై రోజా సెటైర్లు
లోకేష్ ఇసుక సమస్య మీద దీక్ష చేసినట్లు లేదని.. లావుగా ఉన్నాడు కాబట్టి డైటింగ్ చేసినట్లు ఉందని రోజా సెటైర్లు వేశారు. కాగా, ఏపీలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలతో కొందరు కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి సమస్యలను పరిష్కరించాలంటూ లోకేష్ గుంటూరు వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులు చనిపోతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందనా లేదని నారా లోకేష్ మండిపడ్డారు.
చింతమనేని కుటుంబానికి పరామర్శ..
ఇది ఇలావుంటే, శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందంటూ నారా లోకేష్ ఆరోపించారు. వైసీపీ తీరు కారణంగా ఎన్హెచ్ఆర్సీ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అక్రమ కేసులతో వేధింపులు..
టీడీపీ కార్యాలయంలో లోకేష్ మాట్లాడుతూ.. చింతమనేనిపై నాలుగు రోజుల్లోనే 12 కేసులు పెట్టడం దారుణమని అన్నారు. కేసులకు భయపడొద్దని, టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే టీడీపీ నాయకులు, కార్యకర్తలులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
మరో బీహార్లా..
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాదాపు 600 కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. పెట్టుబడులు రాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతుంటే.. శాంతిభద్రతలు లోపించి రాష్ట్రం మరో బీహార్లా తయారవుతోందని విమర్శించారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న మంత్రి బొత్స సత్యనారాయణ.. వాటిని నిరూపించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.