కరోనా : మాస్కు లేకుండా బయటకెళ్తే షాక్ తప్పదు.. అక్కడ కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణ చర్యలకు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు అమలుచేస్తున్నారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూ ఆనంద్ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వాడటం తప్పనసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా మాస్కులు లేకుండా బయటకొస్తే రూ.1000 జరిమానా విధించాలన్నారు. నిత్యావసరాలు,కూరగాయల కొనుగోలు కోసం ఇంటి నుంచి ఒక్కరే బయటకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10గం. లోపు కార్యాలయాలకు చేరుకోవాలని.. ఆ తర్వాత వారిని రోడ్ల పైకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
కాగా,ఏపీలో గురువారం కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రం మరో 15 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ప్రకాశంలో 11, గుంటూరులో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 10 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గురువారం గుంటూరులో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 6కి చేరింది.
ప్రతీ నియోజకవర్గంలో,జిల్లాల్లో కరోనా క్వారెంటైన్ కేంద్రాలను,ఆసుపత్రులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం సేఫ్ టన్నెల్స్ కూడా ఏర్పాటు చేస్తోంది. రెడ్ జోన్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ టన్నెల్స్లో 20 సెకన్ల పాటు నడవడం ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తొలగిపోయే అవకాశం ఉంది. 1.5 మైక్రాన్ల నుంచి 20 మైక్రాన్ల పరిమాణం వరకు ఉండే పరమాణువుల సూక్ష్మక్రిములను దీని ద్వారా డిస్-ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది.