కబ్జా స్ధలంలో టీడీపీ ఆఫీసు- ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ - టీడీపీ, జగన్ సర్కారుకు సుప్రీం నోటీసులు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కబ్జా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్లు వేసిన స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు టీడీపీతో పాటు ఏపీ సర్కారుకూ నోటీసులు జారీ చేసింది.
మంగళగిరి టీడీపీ ఆఫీసును కబ్జా చేసిన స్ధలంలో కట్టారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఆర్కే దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని టీడీపీ, జగన్ సర్కారుకు నోటీసులు పంపింది. ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుతో పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.
Recommended Video
మంగళగిరి టీడీపీ ఆఫీసు నిర్మాణంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి ఈ కేటాయింపులు జరిపాలని పిటిషనర్ ఆర్కే ఆరోపించారు. ఆత్మకూరు పరిధిలోని 3.65 ఎకరాల వాగు భూమిని కబ్జా చేసి ఆఫీసు నిర్మాణం చేశారని సుప్రీం దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా కొట్టిసిందని, అందుకే దాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించినట్లు ఆర్కే తెలిపారు. ఆర్కే తరఫున ఈ కేసులో సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్తో పాటు మరో న్యాయవాది రమేష్ వాదనలు వినిపించారు.