వైఎస్ జగన్తో ఎన్నికల అధికారి ద్వివేదీ భేటీ
అమరావతి: ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మంగళవారం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ద్వివేదీతో పాటు వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎన్నికల అదనపు ప్రధాన అధికారులు సుజాత శర్మ, వివేక్ యాదవ్ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గోపాలకృష్ణ ద్వివేదీ కాబోయే ముఖ్యమంత్రిని కలుసుకోవడం ఇదే తొలిసారి.
ఎన్నికల ప్రక్రియను సజావుగా, విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో.. ద్వివేదీ సోమవారం తిరుమలకు వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలను సమర్పించారు. ఈ ఉదయం అమరావతికి చేరుకున్నారు. అనంతరం- తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి, పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
కాగా పలువురు ఉన్నతాధికారులు వైఎస్ జగన్ను కలిశారు. కె ధనంజయ్ రెడ్డి, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్, మహేష్ చంద్ర లడ్డా తదితరులు వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఉన్నారు.