చిన్నారిపై లైంగికదాడి పాశవిక చర్య, నిందితుడిని శిక్షించాలని జనసేన డిమాండ్
గుంటూరులో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని జనసేన పార్టీ ఖండించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరికొందరు రెచ్చిపోతారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు.
కూతురితో కలిసి
గుంటూరు నగరపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో వివాహిత ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే భర్తతో విడాకులు తీసుకొని తన తల్లి ఇంటి వద్ద ఉంటూ నర్సుగా పనిచేస్తోంది. చిన్నారి ఇంటికి సమీపంలోని పాఠశాలలో చదువుతుంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి తల్లి డ్యూటీకి వెళ్లగా.. గంట తర్వాత అమ్మమ్మ రైతు బజారుకు వెళ్లింది.
సమయం చూసి
ఇదే అదనుగా భావించిన కింద పోర్షన్లో ఉంటోన్న లక్ష్మారెడ్డి చిన్నారి వద్దకొచ్చాడు. చిన్నారిపై లైంగికదాడి చేశాడు. తర్వాత కడుపులో నొప్పి ఉందని తల్లికి చెప్పగా వెంటనే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మారెడ్డి లైంగికదాడికి పాల్పడ్డాడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కఠిన చర్యలు
చిన్నారిపై లైంగికదాడి హేయనీయమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పాశవిక ఘటనగా అభివర్ణించారు. ఈ మేరకు పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. కామాంధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే మరికొందరు రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లైంగికదాడికి గురైన చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. నిందితుడు తాడిపత్రి లక్ష్మారెడ్డిపై ఏపీ దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.