గుంటూరులో జవాను ఘాతుకం: ప్రేమను తిరస్కరించిందని.. అమ్మాయి తల్లిపై కాల్పులు
గుంటూరు: కొన్ని రోజుల పాటు అమ్మాయిల వెంటపడటం...ప్రేమ పేరుతో వేధించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమను అంగీకరించకపోతే అమ్మయి లేదా వారి తల్లిదండ్రులపై రెచ్చిపోతున్నారు ప్రేమోన్మాదులు. తాజాగా ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో జరిగింది. అయితే ఇక్కడ నిందితుడు ఎవరో కాదు ఒక జవాను.
గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే జవాను.. అదే జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో నివసించే రమాదేవి కూతురును గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయిని వేధించాడు. వేధింపులు భరించలేక విషయాన్ని అమ్మాయి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చింది. బాలాజీ తన కూతురును వేధిస్తున్నాడంటూ అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు.
జైలులో కొంత కాలం ఉన్న బాలాజీ విడుదలయ్యాడు. విడుదలయ్యాక నేరుగా తాను ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఓ నాటుతుపాకీ కూడా తన వెంట తీసుకెళ్లాడు. వెళ్లి ఇంటి తలుపు కొట్టగా అమ్మాయి తల్లి రమాదేవి తలుపు తీసింది. చేతిలో తుపాకి చూసి పారిపోయే ప్రయత్నం చేయగా బాలాజీ కాల్పులకు తెగబడ్డాడు. దీంతో రమాదేవి చెవిభాగం నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్ర గాయమైంది. నొప్పిని భరించలేక గట్టిగా కేకలు వేసింది రమాదేవి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్కు తరలించారు.
బాలాజీని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా తుపాకీ, తనతో పాటు తెచ్చుకున్న ఓ బ్యాగును అక్కడే విసిరేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం రమాదేవి ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలాజీకి సహకరించిన ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా కర్లా మండలం నల్లమోతువారిపాలెం బాలాజీ స్వస్థలం అని పోలీసులు తెలిపారు.
Recommended Video
గత కొద్దిరోజులుగా రమాదేవి కూతురు వెనకాల పడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడని చెప్పారు. ఆమె ప్రేమను తిరస్కరించిందని పోలీసులు చెప్పారు. వేధింపులు కొనసాగిస్తుండటంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కొన్ని వారాల క్రితం బాలాజీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలాజీని పట్టుకునేందుకు మూడు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారని ఎస్ఐ చెప్పారు. బాలాజీ ప్రవర్తనపై ఆర్మీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.