ప్రభుత్వాన్ని వదిలిపెట్టం..చంద్రబాబు వార్నింగ్ : పోటీగా వైసీపీ ఛలో ఆత్మకూరు..టెన్షన్..!!
రాజధాని అమరావతి పైన రగడ పూర్తిగా ముగియకముందే..ఇప్పుడు అదే గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో రాజకీయ రగడ మొదలైంది. టీడీపీ కార్యకర్తల పైన వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని వారికి టీడీపీ గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేసింది. 11వ తేదీన వారిని తీసుకొని వారి స్వగ్రామం కు వెళ్లేందుకు పార్టీ నేతలంగా తరలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అడ్డంకులు కలిగించినా ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని సూచించారు. ఛలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని పార్టీ నేతలు ప్రకటించారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు స్పందించారు. తమ కార్యకర్తల మీద టీడీపీ పాలనలో జరిగిన దాడులు..బాధితులతో తాము సైతం ఛలో ఆత్మకూరు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో..జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే గురజాలలో 144 సెక్షన్ విధించారు. మరో వైపు ప్రభుత్వ అధికారులు బాధితులతో మంతనాలు చేస్తున్నారు. కానీ, రాజకీయంగా ఇప్పుడు రెండు పార్టీలు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.
చంద్రబాబు వార్నింగ్..నేతలంగా రావాలని ఆదేశం..
టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో మకాం వేసారు. పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. 110 రోజులుగా గ్రామాలకు దూరంగా వేలాది మంది బాధితులున్నారని వెల్లడించారు. వైసీపీ బాధితులను అధికారులు తీసుకెళ్తామంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు గురజాల డివిజన్లో 144సెక్షన్ విధించారన్నారు. సమస్య పరిష్కారం కావాలన్నదే టీడీపీ ఆకాంక్ష అన్నారు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది కేవలం పల్నాడు ప్రాంత సమస్య మాత్రమే కాదన్నారు. రాష్ట్రమంతా శాంతిభద్రతల సమస్య ఉందన్నారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు అన్నింటిలో ఇవే వేధింపులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితులంతా గుంటూరు చేరుకుంటున్నారన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులందరికీ న్యాయం జరగాలని, తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలని, బాధితులకు అండగా ఉంటుందన్నారు. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పార్టీ నేతలంతా గుంటూరుకు రావాలని ఆదేశించారు. పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తారని..అటువంటి సమయంలో ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని ఆదేశించారు. టీడీపీ దీని ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది.
వైసీపీ సైతం పోటీగా ఛలో ఆత్మకూరు..
టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఛలో ఆత్మకూరు నిర్వహించి తీరుతామని చెబుతుండటంతో..వైసీపీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు..ఎంపీలు సమావేశమయ్యారు. టీడీపీకి పోటీగా తాము కూడా ఛలో ఆత్మకూరు నిర్వహణకు పిలుపునిచ్చారు. టీడీపీ బాధితులంతా గుంటూరు చేరుకోవాలని..బుధవారం ఉదయం 9 గంటలకు వైసీపీ కార్యాలయం నుండి చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వ హాయంలో ఎక్కడా దాడులు లేవని..గ్రామాల్లో సహజంగా ఉండే చిన్న పాటి సమస్యలను చంద్రబాబు రాజకీయంగా విమర్శలకు వాడుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. పల్నాడులో గత అయిదేళ్ల కాలంలో జరగిన దాడుల కారణంగా ఊర్లు వదిలి పారిపోయిన బాధితులతో కలిసి తాము ఆత్మకూరు వస్తామని..చంద్రబాబు సైతం అక్కడకు రావాలని వైసీపీ నేతలు సవాల్ చేసారు. ఎవరి కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బంది పడ్డారో తాజాగా జరిగిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలే స్పష్టం చేస్తాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పల్నాడుకు చెందిన టీడీపీ నేతలు యరపతినేని..కోడెల బాధితులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. టీడీపీ బాధితులను తీసుకొని తాము ఆత్మకూరు వస్తామని..అక్కడే చర్చ నిర్వహిద్దామని వైసీప నేతలు సవాల్ చేసారు. ఆరు నియోజకవర్గాల్లోని బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
144 సెక్షన్..టెన్షన్ వాతావరణం
ఇప్పటికే పల్నాడులోని పరిస్థితుల పైన హోం మంత్రి సుచరిత పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అక్కడ 144 సెక్షన్ విధించారు. బాధితులతో ప్రభుత్వ అధికారులు మాట్లాడారు. వారిని పూర్తి రక్షణ తో సొంత గ్రామాల్లోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయినా..బాధితులు ముందుకు రాలేదు. ఛలో ఆత్మకూరుకు రావాలని పార్టీ నేతలను అధినేత ఆదేశించారు. ఇదే సమయంలో వైసీపీ సైతం ఛలో ఆత్మకూరు కు పిలుపునిచ్చింది. దీంతో..అక్కడ ఎటువంటి ప్రదర్శనలకు..సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో పాటుగా అదనపు బలగాలను మొహరిస్తున్నారు. ఎవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో..రాజకీయంగా గుంటూరు లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.